NEFT &RTGS in Post Office | పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతా కల వారికి శుభవార్త. వారికి కూడా నెఫ్ట్ ( NEFT ), ఆర్టీజీఎస్ ( RTGS ) వసతులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తపాలాశాఖ తెలిపింది. కనుక పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతాదారులు కూడా ఆన్లైన్లో నగదు బదిలీ చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఈ నెల 17న సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 18 నుంచి పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు (పీవోఎస్బీ) నెఫ్ట్ సేవలు పొందొచ్చునని తెలిపింది.
ఇక పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ నెల 31 నుంచి ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇతర బ్యాంకుల నుంచి తపాలాశాఖ ఆధీనంలోని సీబీఎస్ ( డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్- కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్) లో గల పీవోఎస్బీ ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్టీజీఎస్ సేవల ప్రక్రియను పరీక్షిస్తున్నారు.
నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్. పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు పోస్టాఫీసు, బ్యాంక్ సెలవులు, పని వేళలతో సంబంధం లేకుండా ఈ రెండు రకాల సేవలు 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నెఫ్ట్ లావాదేవీలు ప్రతి అర్ధగంటకోసారి పూర్తవుతాయి. నెఫ్ట్ లావాదేవీల ద్వారా ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ అదే రోజు లేదా మరుసటి రోజు బదిలీ అవుతాయి.
రూపాయి నుంచి నుంచి రూ.15 లక్షల వరకు నెఫ్ట్ ద్వారా లావాదేవీలు జరుపవచ్చు.
ఈ-బ్యాంకింగ్, ఎం-బ్యాంకింగ్ చానెళ్ల ద్వారా రూ.2 లక్షల వరకు నెఫ్ట్ లావాదేవీ జరుపొచ్చు. గరిష్ఠంగా రోజుకు ఐదు లావాదేవీలు జరుపొచ్చు. ఈ- బ్యాంకింగ్ లేదా ఎం-బ్యాంకింగ్ ద్వారా రోజువారీ లావాదేవీ పరిమితి రూ.10 లక్షల వరకు బదిలీ చేయొచ్చు. ఫ్రాడ్ ముప్పు తప్పించుకునేందుకు ఈ-బ్యాంకింగ్, ఎం-బ్యాంకింగ్పై పరిమితి విధించొచ్చు. రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు గరిష్ఠంగా రూ.2 లక్షలు నెఫ్ట్ ద్వారా బదిలీ చేయొచ్చు.