న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ కంపెనీ గత కొంతకాలంగా తన పనితీరును మెరుగుపరుచుకునేందుకు పలు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అనేక కఠిన నిర్ణయాలను కూడా తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రూల్స్ను కఠినతరం చేసింది. పైగా వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. అయితే కంపెనీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలే ఇప్పుడు బెడిసికొడుతున్నాయి.
కంపెనీ తీరుతో ఆగ్రహించిన ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు. కంపెనీ చర్యలను ఖండిస్తూ ‘వాక్ ఆఫ్ జాబ్’ సిద్ధమయ్యారు. దాదాపు 2000 మంది అమెజాన్ ఉద్యోగులు సంస్థ తీరుకు వ్యతిరేకంగా సీటెల్లోని ప్రధాన కార్యాలయం స్పియర్స్ భవనం ముందు ‘వాక్ అవుట్’లో పాల్గొనేందుకు సమాయత్తంగా ఉన్నారు. దాంతో అమెజాన్కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.
కాగా, అమెజాన్ సంస్థ గత మే 1 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావడం తప్పనిసరి చేసింది. అంతేగాక గత కొన్ని రోజుల్లో రెండు దఫాల్లో దాదాపు 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. దాంతో కంపెనీ చర్యలను ఖండిస్తూ ఇప్పటివరకు దాదాపు 1,816 మంది ఉద్యోగులు వాకౌట్ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం సియాటిల్లో 873 మంది రెడీగా ఉన్నారు. తమతోపాటు మిగతా ఉద్యోగులు కూడా ఆందోళనలకు కలిసిరావాలని నిరసనలో ఉన్న ఉద్యోగులు కోరుతున్నారు.
కాగా, రిటర్న్ టూ ఆఫీస్ పాలసీపై కంపెనీ వాదన మరోలా ఉంది. ఎక్కువ మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడంతో మెుదటి నెలలో తాము సంతోషంగా ఉన్నామని కంపెనీ వెల్లడించింది. మరింత ఎనర్జీ, కొలాబరేషన్, సంబంధాలు పెరుగుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. ఈ మార్పులను సాధ్యమైనంత సున్నితంగా చేయడానికి కంపెనీలో చాలా బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపింది. కాగా, అమెజాన్ కంపెనీ సీటెల్ లో 65 వేల కంటే ఎక్కువ మంది కార్పొరేట్ ఉద్యోగులను కలిగి ఉంది. ఈ ఏడాది ఆరంభంలో వివిధ విభాగాల్లో మొత్తం 18 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఆమెజాన్, ఇటీవల మరో 9 వేల మంది తీసేసింది. దాంతో గత ఐదు నెలల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న అమెజాన్ ఉద్యోగుల సంఖ్య 27 వేలకు చేరింది.