Mumbai Record Home sales | తక్కువ వడ్డీరేట్లు.. రియాల్టీ డెవలపర్ల ఆఫర్లు.. సొంతిండ్ల కొనుగోళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై దీనికి వేదికైంది. అంతేకాదు.. దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ మార్కెట్ ముంబై. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలోకి నగదు పంపిణీని బలోపేతం చేయడానికి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైకర్లు సొంతింటి కల సాకారం చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు నిరంతరం ఇండ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాదిలో లక్ష ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది గత దశాబ్దిలోనే రికార్డు. స్టాంప్ డ్యూటీలో కోత విధించకున్నా ఆస్తుల.. అంటే ఇండ్ల రిజిస్ట్రేషన్లు నిరంతరం కొనసాగడం ఆసక్తి కర పరిణామం.
ఈ నెలలో గత మూడు వారాల్లోనూ ముంబైలో 5,553 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత నెలలో 7582 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో నవంబర్లో రూ.549 కోట్లు, ఈ నెలలో రూ.421కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ ఇండ్ల రిజిస్ట్రేషన్లలో నూతన రికార్డులు నమోదయ్యాయి.
ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి- నవంబర్ మధ్య 122 శాతం ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వానికి రూ.5351 కోట్ల ఆదాయం లభించిందని రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ముంబైలో ఇండ్లకొనుగోలు దారుల్లో సెంటిమెంట్ బలంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ తెలిపారు. 2020లో స్టాంప్ డ్యూటీలో కోత విధించిన నవంబర్ వరకు 9,300 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వానికి కేవలం రూ.288 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా మహమ్మారికి ముందు 2019 నవంబర్లో 6,433, డిసెంబర్లో 5574 ఇండ్ల విక్రయాలు జరిగాయి.