హైదరాబాద్: కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ డ్రగ్ను విడుదల చేసేందుకు మరో ఫార్మా కంపెనీ సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్, మోలుఫ్లో బ్రాండ్ పేరుతో కోవిడ్-19 చికిత్స కోసం జెనరిక్ మోల్నుపిరవిర్ 200 ఎంజీ క్యాప్సూల్స్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. మోల్నుపిరవిర్ అనేది నోటి ద్వారా తీసుకునే కరోనా యాంటీ వైరల్ ఔషధం. అనారోగ్య సమస్యలుండి, స్వల్ప, తేలికపాటి కరోనా లక్షణాలున్న పాజిటివ్ రోగులకు చికిత్స కోసం దీనిని సిఫార్సు చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్తోపాటు ఇప్పటికే పలు ఫార్మా సంస్థలు మోల్నుపిరవిర్ డ్రగ్ను మార్కెట్లోకి విడుదల చేశాయి.
ఈ నేపథ్యంలో ఎంఎస్ఎన్ ఫార్మా కూడా మోలుఫ్లో పేరుతో ఈ డ్రగ్ను ఉత్పత్తి చేసింది. ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ (EUA)కు డీసీజీఐ నుంచి ఆమోదం కూడా లభించింది. దీంతో మోలుఫ్లో 200 ఎంజీ క్యాప్సూల్స్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. నోటి ద్వారా తీసుకునే ఈ ఔషధం కరోనా రోగులకు ఉపశమనం కలిగిస్తుందని, దీనికి ఆదరణ పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు ఎంఎస్ఎన్ గ్రూప్ తెలిపింది. త్వరలో అన్ని రిటైల్ మందులషాపులలో ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.