IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఈ నెల తొమ్మిది రోజుల్లోనే రెండు కోట్ల మందికి పైగా ఐటీఆర్ దాఖలు చేశారని ఆదాయం పన్ను విభాగం ట్వీట్ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022 జూలై 20 నాటికి రెండు కోట్లకి పైగా ఐటీఆర్లు దాఖలు అయ్యాయి. దానికి భిన్నంగా ఈ ఏడాది కేవలం తొమ్మిది రోజుల్లోనే రెండు కోట్ల పై చిలుకు ఐటీఆర్లు దాఖలు కావడం ఆసక్తికర పరిణామం.
ఈ నెలాఖరులోగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి వేతన జీవులు, చిన్న వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు.. ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందేనన్న సంగతి తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయం పన్ను విభాగం కోరింది. ఈ నెలాఖరు దాటితే ఐటీఆర్ దాఖలు చేయడానికి లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అడిట్ పరిధిలోకి రాని వారంతా ఈ నెలాఖరులోగా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి ముందు ప్రతి ఒక్కరూ తమ ఏఐఎస్ నివేదిక చెక్ చేసుకోవాలని ఐటీ విభాగం సూచించింది. ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది.
అయితే, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇప్పుడు రెండు విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నూతన ఐటీ పాలసీని డిఫాల్ట్గా పెట్టింది కేంద్రం. పాత ఐటీ పాలసీలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయ తలపెట్టిన వారు ప్రత్యేకంగా పేర్కొనాల్సి ఉంటుంది. నూతన ఐటీ పాలసీ కింద మినహాయింపులు పరిమితం. పాత ఐటీ పాలసీ కింద పలు మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి.