హైదరాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) మాజీ అధ్యక్షులు ఎంఎల్ అగర్వాల్ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ కారిగేటెడ్ కేస్ అసోసియేషన్(ఐసీసీఏ) వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. తద్వారా ఆయన 2025-27లో ఐసీసీఏ చైర్మన్గా ఎన్నిక కానున్నట్లు ఎఫ్టీసీసీఐ వర్గాలు తెలిపాయి.
అగర్వాల్ జీడిమెట్లలోని సెంట్రల్ ఇండియా ప్యాకేజింగ్ కంపెనీ ఎండీగా వ్యవహరిస్తున్నారు. 1961లో ఐసీసీఏ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు వైస్ చైర్మన్గా ఎన్నికైన మొదటి భారతీయుడు అగర్వాలేనని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా 2027 జనవరి 28నుంచి 30వరకు జరిగే ఐసీసీఏ గ్లోబల్ సమ్మిట్కు హైదరాబాద్ను ఎంపికచేసినట్లు చెప్పారు.