సుందర్.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగంలో ఉన్నారు. వార్షిక వేతనం కోటి రూపాయలకుపైనే. ఈయన ఇప్పటివరకూ 30 శాతం గరిష్ఠ పన్ను శ్లాబులో ఉన్నారు. అందుకే ఎక్కడ సాధ్యమైతే అక్కడ పన్ను ప్రయోజనం (ట్యాక్స్ సేవింగ్స్) పొందే మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా రూ.5 లక్షలపైన ప్రీమియం ఉండే మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీలపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. ఎందుకంటే ఈ పాలసీ తీసుకోవడం వల్ల చెల్లించే ప్రీమియంపై పన్ను రాయితీతోపాటు మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలపై కూడా ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన పనిలేదు. నిజానికి హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్కు ఇదో వరప్రదాయిని లాంటిదే. అయితే ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రం ఈ పాలసీలకు చెల్లుచీటి ఇచ్చేసింది కేంద్ర బడ్జెట్. అందుకే కాస్త నిరుత్సాహంతో ఉన్నారు సుందర్ వంటివాళ్లు.
నిజంగా అంత ప్రభావం ఉందా?
వాస్తవానికి మన దేశంలో బీమా రంగానికి ఇప్పటికీ తగినంత ప్రాధాన్యత దక్కడం లేదు. ఇన్సూరెన్స్ తీసుకునేవాళ్ల సంఖ్య వందలో ఐదుగురిని మించదు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 100 శాతం ఉంటుంది. అయితే కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే జనాల్లో అవగాహన పెరిగి ఆరోగ్య బీమా కొనుగోళ్ల వైపు చూస్తున్నారు. కానీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఇంకా పూర్తిస్థాయిలో మన దగ్గర అవగాహనే లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని గతంలో చాలావరకూ మిస్ సెల్లింగ్ జరిగింది. ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ రెండింటినీ మిక్స్ చేసి విక్రయించుకునేందుకు అనుమతులు ఇవ్వడం వల్ల చాలా విమర్శలను రెగ్యులేటర్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. దశాబ్దం క్రితం వీటిలో సమూల మర్పులను చేసినప్పటికీ ఇంకా యూలిప్స్ అనే ఒక నెగిటివ్ భావనే జనాల్లో ఉన్నది. ఇప్పుడు యూలిప్స్ కోసం చెల్లించే ప్రీమియం విషయంలో కూడా రూ.2.5 లక్షల వరకూ మాత్రమే పన్ను మినహాయింపు ఉన్నది.
అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెచ్చిన మార్పులు బీమా రంగానికి బాగా నెగిటివ్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొత్త పన్ను విధానంలోకి మారితే.. ఎలాంటి మినహాయింపులు ఉండబోవు. అలాంటప్పుడు బీమా తీసుకునేవాళ్ల సంఖ్య తగ్గిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక అధిక ప్రీమియం పాలసీల వాటా ఒక్కో కంపెనీకి ఒక్కో రకంగా ఉంది. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ లైఫ్ వ్యాపారంలో ఈ అధిక ప్రీమియం పాలసీల వాటా 10 శాతం వరకూ ఉంటే ఎస్బీఐకి మాత్రం ఒక్క శాతంలోపే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్కు 6 శాతం, మ్యాక్స్ లైఫ్కు 9 శాతం వరకూ ఉన్నది. అందుకే కేంద్ర బడ్జెట్లో ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ స్టాక్స్ బాగా నష్టపోయాయి.
ఫైర్ సేల్స్!
వచ్చే నెల 1 తర్వాత కొనుగోలు చేసే పాలసీలకు పన్ను రాయితీలు లేకపోవడం, మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను వర్తింపు వంటి నిర్ణయాల కారణంగా ఈ నెలాఖర్లోగానే పాలసీలను కొనడం లాభదాయకం. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోళ్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధికంగా ఉంటాయి. మొత్తం సేల్స్లో 30 శాతానికిపైగా ఈ మూడు నెలల్లోనే జరుగుతాయి. గ్యారెంటీడ్ ఇన్కమ్ హై ప్రీమియం పాలసీ సేల్స్ అత్యధికంగా ఉన్నాయని బీమా సంస్థలూ చెప్తున్నాయి. నాన్ యూలిప్ సేల్స్ 20 శాతానికిపైగా పెరిగినట్టు కొన్ని సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య మార్చిలో మరింతగా పెరిగే వీలున్నది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా త్వరపడండి. ఒకవేళ అధిక ప్రీమియం చెల్లించే స్థోమత ఉండి, పన్ను ప్రయోజనం పొందుతూ, మెచ్యురిటీ తర్వాత వచ్చే సొమ్ముపై (ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్) పన్ను లాభాలు పొందాలంటే ఇదే ఆఖరి అవకాశం.
–నాగేంద్ర సాయి కుందవరం
బడ్జెట్తో బీమా రంగం బేర్మన్నది!
పన్ను ప్రోత్సాహకాలను సాధ్యమైనంతగా తగ్గించేందుకు, జనాలను కొత్త ట్యాక్స్ విధానం వైపు తీసుకెళ్లేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో చాలా మార్పులనే తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా శ్లాబు మార్పులు, పన్నుల తగ్గింపు వంటి చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితోపాటు రూ.5 లక్షలకు మించి పాలసీ ప్రీమియం చెల్లిస్తే వాటికి పన్ను ప్రయోజనాలను తీసేయబోతున్నారు. ఇది వాస్తవానికి బీమా రంగం ఊహలో కూడా లేని అంశం. సెక్షన్ 80సీ పన్ను పరిధి పెంచుతారని, ఆరోగ్య బీమా తీసుకునేవాళ్లకు ప్రోత్సాహకాలు అందిస్తారని భావిస్తున్న తరుణంలో ఇలాంటి షాకింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాలతోపాటు ఒకేసారి సింగిల్ ప్రీమియం పాలసీలు తీసుకునేవాళ్లను కూడా ఇబ్బందిపెట్టింది. దీని ప్రకారం ఒక ఏడాదిలో ఎన్ని పాలసీలు తీసుకున్నాసరే ప్రీమియం చెల్లింపులు మాత్రం రూ.5 లక్షలకు మించకూడదు. అలా ప్రీమియం మించితే పన్ను రాయితీ వర్తించకపోవడంతోపాటు మెచ్యూరిటీ సమయంలో వచ్చే డబ్బుకు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది డబుల్ ఎఫెక్ట్ లాంటిది. అయితే మరణానంతరం లభించే క్లెయిం సొమ్ముపై మాత్రం ఎలాంటి పన్నూ లేదని గమనించాలి.