రామచంద్రాపురం, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): విద్యుత్ పరికరాల ఉత్పత్తిలో భెల్ బలోపేతానికి నూతన విధానాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ నలిన్ సింఘాల్ అన్నారు. గురువారం కంపెనీ 57వ వార్షిక సర్వసభ్య సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో 14 యూనిట్లు కలిగివున్న మహారత్న సంస్థ భెల్ కావడం విశేషమని, నూతన టెక్నాలజీని ఆపాదించుకొని భవిష్యత్తులో అన్ని యూనిట్లను ఆధునీకరించనున్నట్లు ఆయన ప్రకటించారు. కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భెల్ వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసగించారు. భారీ విద్యుదుత్పత్తి పరికరాల తయారిలో భెల్కు సాటి ఏది రాదన్న ఆయన..వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్దేశించిన సమయానికి ఆర్డర్లు అందించేలా కృషి చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. భెల్ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి వాటాదారులు, ఉద్యోగులు అందరూ సమిష్ఠిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భెల్ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో డిమాండ్ ఉన్నదన్నారు.