హైదరాబాద్, అక్టోబర్ 17 (బిజినెస్ బ్యూరో): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) దేశంలోని బిజినెస్ స్కూళ్లలో టాపర్గా ఉన్నది. టాప్-100 ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ 2022 ర్యాంకుల్లో ఐఎస్బీ.. భారత్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయిలో ఈ హైదరాబాదీ స్కూల్ 44వ స్థానంలో ఉన్నట్టు తేలింది. ఐఎస్బీ తర్వాత దేశీయ రెండో అత్యుత్తమ బిజినెస్ స్కూల్గా ఐఐఎం బెంగళూరున్నది. అంతర్జాతీయంగా దీనికి 67వ ర్యాంకు వచ్చింది. కాగా, ఈ ఏడాది ర్యాంకుల కోసం ఐఎస్బీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ (పీజీపీఎంఏఎక్స్) 2019 క్లాస్కు చెందిన పూర్వ విద్యార్థి సర్వే చేపట్టారు. ఇందులో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది చాలా ప్రమాణాల్లో ఐఎస్బీ ఎంతో మెరుగైనట్టు స్పష్టమైంది. ‘ర్యాంకులకు సంబంధించి ఎఫ్టీ నిర్దేశించిన వివిధ ప్రామాణికతల్లో ఐఎస్బీ అత్యుత్తమంగా నిలవడం సంతోషకరం. భవిష్యత్తులోనూ ఈ గుర్తింపునకు తగ్గట్టుగా ఐఎస్బీ పనిచేస్తుంది’ అని ఈ సందర్భంగా ఐఎస్బీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై అన్నారు.
‘తరగతి గది, పాఠ్యాంశాలను దాటి విద్యార్థి ప్రయాణం ఉంటుంది. ఇలా ఓ ప్రపంచ స్థాయి సర్వేలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉన్నది. ఈ అనుభవం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మున్ముందు అనేక సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది’ అని ఐఎస్బీ పీజీపీఎంఏఎక్స్ 2019 క్లాస్ పూర్వ విద్యార్థి పూర్ణిమ బుష్పాల అన్నారు. ఎఫ్టీ ఈఎంబీఏ ర్యాంకులు అనేవి ప్రపంచంలోని ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సుల్లో సమగ్రమైనవి. కనీసం పదేండ్ల పని అనుభవం ఉన్న సీనియర్ స్థాయి ఉద్యోగుల కోసం 15 నెలల గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ స్థాయి ప్రోగ్రామే ఐఎస్బీ పీజీపీఎంఏఎక్స్.