Market Capitalisation | నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నా.. ఇక ముందు కూడా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచడానికే మొగ్గు చూపుతున్నదన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీన పరిచాయి. మరోవైపు, అంతర్జాతీయంగా వివిధ కరెన్సీలపై డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం కూడా ఆందోళనకు గురి చేసింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎనిమిది వరుససెషన్లలో వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం దేశీయ స్టాక్మార్కెట్ల ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు రూ.2.85 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.79.79 వద్ద నిలిచింది.
రెండు నెలల క్రితం అంటే జూన్లో నమోదైన కనిష్టాల స్థాయి నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 18 శాతం లాభ పడింది. ఈ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్ఈ-30 ఇండెక్స్లో రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, మారుతి, ఎస్బీఐ, హెచ్యూఎల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ స్క్రిప్ట్లు నష్టపోయాయి. కేవలం ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ 60,351.28 పాయింట్ల వద్ద మొదలై ఒకానొక దశలో 900 పాయింట్ల పతనంతో 59,474.57 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి, ముగింపు దశలో కాస్త కోలుకున్నది. 651. 85 పాయింట్ల నష్టంతో 59,646.15 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 17,966 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలై అంతర్గత ట్రేడింగ్లో 17,710 పాయింట్ల కనిష్టానికి పడిపోయి 198 పాయింట్ల పతనంతో 17,758 వద్ద నిలిచింది.