హైదరాబాద్, డిసెంబర్ 23: దేశవ్యాప్తంగా సంతాన సాఫల్య చికిత్స దవాఖానల్ని నడుపుతున్న ఇందిరా ఐవీఎఫ్.. ఇన్సూర్టెక్ కంపెనీ సేఫ్ట్రీతో చేతులు కలిపింది. సంతానం లేక (ఇన్ఫర్టిలిటీ) ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న జంటలకు ఊరటనిచ్చేలా ఇరు సంస్థలు కలిసి తాజాగా ఓ ప్రత్యేక ఆరోగ్య బీమాను పరిచయం చేశాయి. దేశంలోనే ఈ రకమైన బీమా ఇదే మొదటిది కావడం విశేషం. ఇక ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద 35 ఏండ్లలోపు జంటలకు సమగ్ర రీతిలో 24 నెలల మద్దతు లభిస్తుంది. వైద్య, ఆహార, మానసిక సంబంధిత విషయాల్లో కన్సల్టేషన్స్ ఉంటాయి. ఐయూఐ, ఐవీఎఫ్ల్లో రెండేసి చొప్పున రౌండ్ల కవరేజీ దొరుకుతుంది. అండాల సేకరణ, లేజర్ టెక్నాలజీ ఆధారిత వైద్యం, బ్లాస్టోసిస్ట్ కల్చర్, పిండం బదిలీ, దాని నిలుపుదల వంటి వివిధ వైద్య సహాయాలు అందుకోవచ్చు.
అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021, సరోగసి (రెగ్యులేషన్) యాక్ట్ 2021లకు అనుగుణంగా అండ దాతలకు, సరోగేట్లకు కూడా ఈ కవరేజీని పొడిగించుకోవచ్చని సంస్థలు తెలిపాయి. కాగా, సంతాన లేమితో బాధపడుతున్న చాలామంది జంటలు నేడు దానికి సంబంధించిన చికిత్సల్ని తీసుకోవడానికి ఆర్థికంగా సతమతమవుతున్నాయని, అలాంటి వారందరి కోసమే ఈ బీమాను తెచ్చామని ఈ సందర్భంగా ఇందిరా ఐవీఎఫ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన, సంస్థ సీఈవో డాక్టర్ క్షిటిజ్ ముర్దియా, సేఫ్ట్రీ ఇన్సూరెన్స్ సీఈవో వికాస్ ఆనంద్ తెలిపారు.
భారత్లో 3.3-3.4 కోట్ల జంటలు సంతానపరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్టు డబ్ల్యూహెచ్వో చెప్తున్నది. వీరిలో కేవలం ఒక్క శాతం జంటలే సంతాన సాఫల్య చికిత్సల్ని తీసుకోగలుగుతున్నాయని, ఇందుకు వైద్యంపై అవగాహన లేకనో, ఆర్థిక ఇబ్బందులో కారణమవుతున్నాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే 90 శాతానికిపైగా జంటలు ఆర్థిక స్థోమత లేకనే సంతాన చికిత్సలకు దూరంగా ఉంటున్నాయని తేలినట్టు వివరించారు. అందుకే ఈ బీమాను తెస్తున్నట్టు స్పష్టం చేశారు.