న్యూఢిల్లీ, జూలై 30: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,213.44 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,181.66 కోట్ల లాభంతో పోలిస్తే ఇది కేవలం 2.7 శాతం మాత్రమే పెరిగింది. బ్యాంక్ ఆదాయం కూడా రూ.11,444 కోట్ల నుంచి రూ.11,759.29 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. సమీక్షకాలంలో బ్యాంక్ వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం 5.5 శాతం అధికమై రూ.10,153.66 కోట్లకు చేరుకున్నది. బ్యాంక్ మొండి బకాయిలు 13 శాతం తగ్గి రూ.2,558.57 కోట్ల నుంచి రూ.2,218.93 కోట్లకు దిగొచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 9.69 శాతం(రూ.37,759 కోట్లు) నుంచి 8.13 శాతానికి(రూ.34,573 కోట్లు) తగ్గాయి. అలాగే నికర ఎన్పీఏ రూ.12,653 కోట్లు(3.47 శాతం) నుంచి రూ.8,471 కోట్లకు(2.12 శాతానికి) తగ్గాయి.