Income Tax | న్యూఢిల్లీ, ఆగస్టు 19: జీతభత్యాలు అందుకునే ఉద్యోగులకు ఊరటనిస్తూ యాజమాన్యాలు కల్పించే రెంట్-ఫ్రీ అకామిడేషన్ విలువ లెక్కింపుపై ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు మార్చింది. దీంతో ఉద్యోగుల టేక్-హోం సేలరీ పెరుగుతుంది. సవరించిన ఐటీ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. శనివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మినహా ఇతర ప్రైవేటు, కార్పొరేషన్ల ఉద్యోగులకు యాజమాన్యాలు కల్పించే అన్ఫర్నిష్డ్ అకామడేషన్కు లెక్కకట్టే విలువ శాతాన్ని తగ్గించారు. అయితే ఆ నివాసం యాజమాన్యం సొంత ఆస్తి అయి ఉండాలి. సాధారణంగా ఉద్యోగులు రెంట్-ఫ్రీ అకామడేషన్ను పొందుతున్నట్టయితే, ఐటీ నిబంధనల ప్రకారం దాని విలువను వారి వార్షిక జీతంలో నిర్దిష్ఠశాతంగా లెక్కించి, దానిపై పన్ను విధిస్తారు. నిబంధనల్ని మార్పు చేయడం ద్వారా ఇప్పుడీ విలువ శాతాన్ని తగ్గించారు. ఉదాహరణకు ఈ సదుపాయం పొందుతున్న ఉద్యోగికి రూ.5 లక్షల వార్షిక జీతభత్యాలు (వేతనం+అలవెన్సులు) ఉన్నట్లయితే, రెంట్-ఫ్రీ అకామిడేషన్ను 10 శాతంగా (నివాసం ఉన్న ప్రాంతానికి అనుగుణంగా శాతం ఉంటుంది) లెక్కించడంతో అది రూ.50,000 అవుతుంది. దానికి పన్ను వర్తిస్తుంది. మార్పు చేసిన వివరాలివి..
అధిక జీతభత్యాలు తీసుకుంటూ యాజమాన్యం నుంచి అకామడేషన్ పొందే ఉద్యోగులకు తాజాగా సవరించిన రేట్లతో ఎక్కువ లబ్ది చేకూరుతుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్టనర్ అమిత్ మహేశ్వరి చెప్పారు. దాని విలువ తగ్గింపుతో వారి టాక్స్బుల్ సేలరీ బేస్ దిగివచ్చి, ఇంటికి తీసుకెళ్లే నికర జీతం పెరుగుతుందని వివరించారు. అధిక ఆదాయం గల ఉద్యోగులు ఎక్కువ లాభం కలుగుతుందని, తక్కువ జీతభత్యాలు కలిగి ఓ మోస్తరు అకామడేషన్ పొందుతున్నవారికి పన్ను ప్రయోజనం పెద్దగా ఉండదని ఏఎంఆర్జీ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ తెలిపారు. సిబ్బందికి తగిన పన్ను ప్రయోజనాల్ని కల్పించేందుకు కార్పొరేట్ యాజమాన్యాలు వాటి ప్రస్తుత కాంపన్సేషన్ ఫ్రేమ్వర్క్స్ను మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.