రామచంద్రాపురం, జూన్ 9: నిర్మాణ రంగంలో మై హోమ్ అగ్రగామిగా నిలుస్తున్నదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. గోపనపల్లి నుంచి తెల్లాపూర్ రోడ్డులో మై హోమ్, ప్రతిమ గ్రూప్ సంయుక్తంగా ‘మైహోమ్ సయూక్’ పేరుతో ఓ భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును గురువారం ఆయా సంస్థల చైర్మన్లు జూపల్లి రామేశ్వర్రావు, శ్రీనివాస్రావులతో కలిసి అల్లు అర్జున్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మై హోమ్ సంస్థ 35 సంవత్సరాల నుంచి నిర్మాణ రంగంలో రాణిస్తున్నదని తెలియజేశారు.
ప్రతీ ప్రాజెక్టు అద్భుతమన్న ఆయన మాదాపూర్లో మై హోమ్ నిర్మించిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులో తనకూ ఓ ఫ్లాట్ ఉన్నదని, అందులోకి వెళ్తే దుబాయ్, సింగపూర్లకు వెళ్లినట్టు ఉంటుందని చెప్పారు. ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మాణాలు చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు. తెల్లాపూర్లో చేపట్టే మై హోమ్ సయూక్ ప్రాజెక్టు కూడా అద్భుతంగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మై హోమ్ సంస్థపైన కస్టమర్లకు ఎంతో నమ్మకం ఉన్నదని, సయూక్కి సంబంధించి అప్పుడే వెయ్యి ఫ్లాట్స్ బుక్ కావడం ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
అనంతరం మై హోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు మాట్లాడుతూ.. తెల్లాపూర్లో అద్భుతమైన ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇది మై హోమ్, ప్రతిమ గ్రూప్ కలిసి చేస్తున్న ఉమ్మడి ప్రాజెక్టు అన్నారు. 25.37 ఎకరాల్లో జీ+39 ఫ్లోర్లతో 12 టవర్లను నిర్మించబోతున్నట్టు వివరించారు. ప్రస్తుతం 6 టవర్లకు బుకింగ్స్ ప్రారంభించామన్నారు. 82 శాతం ఓపెన్ ఏరియాను కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ చొప్పున 2, 2.5, 3 బీహెచ్కేలు ఉంటాయన్నారు.
ప్రీమియం లైఫ్స్టెల్ ఫ్లాట్ 1,355 చదరపు అడుగుల నుంచి 2,262 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుందని తెలిపారు. సౌకర్యవంతమైన జీవనం, అంతే సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాల్లో కమ్యూనిటీలకు అతి చేరువగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్లను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో మై హోమ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు, మేనేజింగ్ డైరెక్టర్ జూపల్లి శ్యామ్రావు, సీనియర్ ప్రెసిడెంట్ కనక రవిసాయి తదితరులు పాల్గొన్నారు.