న్యూఢిల్లీ: ఒక వ్యక్తి అత్తవారింటిపై కోపంతో విషం కలిపిన చేప కూర తెచ్చాడు. అది తిన్న అత్త, మరదలు మరణించగా, భార్య, మామతోపాటు ఇంటి పనిమనిషి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో నివాసం ఉండే వరుణ్ అరోరా, ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. థాలియం అనే విషపదార్థంతో సద్దాం తన రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసినట్లు తెలుసుకున్నాడు. తనను అవమానిస్తున్న అత్తింటి వారిని థాలియంతో అంతం చేయాలని నిర్ణయించుకుని దానిని కొనుగోలు చేశాడు.
వరుణ్ అరోరా జనవరి నెల చివరిలో ఢిల్లీలోని తన అత్తవారింటికి భార్యతో కలిసి వెళ్లాడు. బయట నుంచి చేప కూర తెచ్చి దానిలో థాలియం కలిపాడు. అది తిన్న అత్త అనితా దేవి శర్మ, మామ దేవేందర్ మోహన్ శర్మ, మరదలు ప్రియాంక, భార్య దివ్యతోపాటు ఆ ఇంటి పనిమనిషి అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ గత నెల 15న మరదలు ప్రియాంక, అనంతరం అత్త అనితా దేవి చనిపోయారు. వీరిద్దరు విష ప్రయోగం వల్ల చనిపోయినట్లు పోస్ట్మార్టం రిపోర్టులో నిర్ధారణ అయ్యింది.
మరోవైపు చికిత్స పొందుతున్న భార్య, మామ రక్తంలో విషపదార్థమైన థాలియంను వైద్యులు గుర్తించారు. వారి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు వరుణ్ అరోరాను మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో సోదా చేసి థాలియంను స్వాధీనం చేసుకున్నారు. దానిని కొనుగోలు చేసిన వివరాలను అతడి మొబైల్ నుంచి తెలుసుకున్నారు.
కాగా, తన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై తాను విషప్రయోగం చేసినట్లు వరుణ్ అంగీకరించాడు. తనను పదే పదే అవమానిస్తుండటంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.