హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఐటీ కార్యకలాపాల్లోనే కాకుండా ఇంజినీరింగ్ ఆవిష్కరణల్లోనూ హైదరాబాద్ మహానగరం సత్తా చాటుతున్నదని, ఇప్పటికే ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు నగరం కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. గురువారం ఐటీ కారిడార్లోని నాలెడ్జ్ పార్క్లో అంతర్జాతీయ సంస్థ గ్రిడ్ డైనమిక్స్ ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ను సంస్థ సీఈవో లియోనార్డ్ లివ్సిజ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ మహానగరం బహుళ జాతీయ కంపెనీల కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అంతర్జాతీయ కంపెనీల ఏర్పాటుకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తుండటం ఇందుకు కారణమని తెలిపారు. అలాగే సులభతరమైన అనుమతుల విధానాలతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తాజాగా అంతర్జాతీయ కంపెనీ అయిన గ్రిడ్ డైనమిక్స్ తమ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న కంపెనీ సీఈవోకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
సంస్థ సీఈవో లియోనార్డ్ లివ్సిజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీర్లు కలిగిన నగరం.. ఇక్కడ ప్రీమియర్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ల ద్వారా తమకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చుకునే అవకాశం ఉందన్నారు. మా గ్లోబల్ ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం అత్యంత క్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిష్కరించడానికి అత్యుత్తమ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ ప్రారంభమైన తమ సేవలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.