న్యూఢిల్లీ, మే 18: దేశంలో విస్తరిస్తున్న డాటా సెంటర్ రంగాభివృద్ధిలో హైదరాబాద్ వంటి నగరాలు ఆకర్షణీయంగా మారనున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా డాటా సెంటర్ అడ్వైజరీ అధిపతి రచిత్ మోహన్ తెలిపారు. ముఖ్యంగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్న తరుణంలో డాటా సెంటర్ల ప్రాధాన్యత గణనీయంగా పెరుగబోతున్నదని చెప్పారు. దీంతో అన్నివిధాలా అనువైన హైదరాబాద్కు కొత్త కేంద్రాల రాక ఎక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న క్లౌడ్ సేవలు, డిజిటలైజేషన్తోపాటు ప్రగతిశీల చట్టాల వల్ల డాటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడుతున్నది. అలాగే విపరీతంగా పెరిగిన స్మార్ట్ డివైజ్ల వినియోగం మధ్య డాటా లోకలైజేషన్కు ప్రాముఖ్యత ఏర్పడింది. ఫలితంగా దేశీయ మార్కెట్పై వివిధ జాతీయ, అంతర్జాతీయ డాటా సెంటర్ ఆపరేటర్లు, డెవలపర్లు దృష్టి పెట్టారని మోహన్ అంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే మూడేండ్లలో ముంబై, చెన్నైల్లో డాటా సెంటర్ పరిశ్రమ మరింత పెరుగుతుందని, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ తదితర నగరాల్లోనూ వృద్ధి కనిపిస్తుందని తెలియజేశారు.
రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో డాటా సెంటర్ రంగం కోసం 60 లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధికి దాదాపు రూ.27 వేల కోట్ల (3.7 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు కావాలని జేఎల్ఎల్ ఓ తాజా ప్రకటనలో అంచనా వేసింది. 2021-23 వ్యవధిలో భారతీయ డాటా సెంటర్ పరిశ్రమ అదనంగా 560 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఈ రంగం కోసం 60 లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సుమారు రూ.27 వేల కోట్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం ఈ పరిశ్రమ సామర్థ్యం 447 మెగావాట్లుగా ఉందని, ఎప్పుడూ లేనంతగా గతేడాదే ఏకంగా 102 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుకున్నదని జేఎల్ఎల్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఐరోపా, అమెరికా వంటి ప్రధాన మార్కెట్లతో పోల్చితే ఇది ఎక్కువని మోహన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2023 కల్లా 1,007 మెగావాట్ల సామర్థ్యాన్ని దేశీయ డాటా సెంటర్ల రంగం అందిపుచ్చుకోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.