Home Sales | వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండ్ల ధరలు మరో ఐదు శాతం పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది నుంచి 10 శాతం ధరలు పెరిగాయని పేర్కొంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతోపాటు, ధరల నియంత్రణకు వడ్డీరేట్లు పెంచడంతో రుణభారం పెరిగింది. ద్రవ్యోల్బణం, నిర్మాణ వ్యయం వంటి సవాళ్లు ఉన్నా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండ్ల విక్రయాలు తొమ్మిది శాతం పెరుగుతాయని అంచనా వేసింది.
జాతీయంగా, అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం సవాళ్లు వెంటాడినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండ్ల కొనుగోళ్లలో పురోగతి నమోదైందని ఇండియా రేటింగ్స్ వివరించింది. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం తదితర ఇబ్బందులతో స్వల్ప కాలికంగా ఇండ్ల కొనుగోలు విషయంలో డిమాండ్ దెబ్బ తిన్నదని పేర్కొంది. అయినా, మున్ముందు ఇండ్ల కొనుగోళ్లకు గిరాకీ క్రమక్రమంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
పెరుగుతున్న ఇండ్ల నిర్మాణ ఖర్చులతో డెవలపర్లపై భారం పడుతున్నదని ఇండియా రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది ఐదారు శాతం నిర్మాణ ఖర్చు పెరుగుతుందని అంచనా వేసింది. అయినా.. వచ్చే ఆరేడు నెలల వరకు తమపై పడుతున్న భారాన్ని ఇండ్ల కొనుగోలుదారులకు బదిలీ చేసే పరిస్థితి డెవలపర్లకు లేదని స్పష్టం చేసింది. దీనికి ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులే కారణం అని పేర్కొంది.
ద్రవ్యోల్బణం వల్ల ఇప్పటికే ఇండ్ల ధరలు పెంచడం వల్ల చౌక ధరల సెగ్మెంట్లో ఇండ్లకు గిరాకీ తగ్గిందని వెల్లడించింది. దీనికి ఇండ్ల రుణాలపై బ్యాంకుల వడ్డీరేట్లు పెరిగిపోవడం కూడా కారణం అని వ్యాఖ్యానించింది. ఫలితంగా ఇండ్ల కొనుగోలు సెంటిమెంట్ మరింత దెబ్బ తిన్నదని పేర్కొన్నది. 2023-24లో రెసిడెన్షియల్ స్థిరాస్తి రంగ ఔట్లుక్ను ఇంప్రూవ్ మెంట్ స్థాయి నుంచి న్యూట్రల్ స్టాయికి తగ్గించింది. ద్వితీయ శ్రేణి సంస్థలు ఇండ్ల సేల్స్ తక్కువగా ఉండటంతోపాటు వసూళ్లు లేక నగదు లభ్యత సమస్యను ఎదుర్కొన్నారని తెలిపింది.