జీఎస్టీలో రాష్ట్రాలకు పరిహారం వాటాపై జీఎస్టీ కౌన్సిల్ చివరి క్షణంలో న్యూ ఫార్ములాను ప్రవేశపెట్టడం ఏమిటంటూ విపక్షాల పాలిత రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నిలదీశాయి. గత జూలై తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగడం ఇదే తొలిసారి. రాష్ట్రాలకు పరిహారంపై న్యూ ఫార్ములాను తేవడం ఏమిటంటూ తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమావేశంలో కేంద్రమంత్రిని నిలదీసినట్లు సమాచారం.
మహారాష్ట్రకు రూ.30 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అజిత్ పవార్ చెప్పారు. మిగతా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సైతం చివరిక్షణంలో ఏజెండాలో పరిహారంపై న్యూ ఫార్ములా ప్రతిపాదించడం ఏమిటని నిలదీశారు. ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేవలం 48 గంటల ముందు ఎజెండాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేర్చినట్లు తెలుస్తున్నది. ఎంతో ముఖ్యమైన అంశంపై అతి తక్కువ సమయంలో ఎలా చర్చిస్తారని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ప్రశ్నించారు.
తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మాట్లాడుతూ తక్కువ టైంలో నోటీసు ఇవ్వడంతో కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అసౌకర్యానికి గురయ్యారన్నారు. ఏజెండా అంశాలు బిట్లుగా, ముక్కలుముక్కలుగా పంపారని ఆరోపించారు. పరిహారంపై నోటీసు ఆదివారం మాత్రమే పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ పరిహారం ఏటా 14 శాతం లోపు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ఫార్ములా గడువు వచ్చే జూన్తో ముగియనున్నది. జూలై నుంచి కొత్త ఫార్ములా అమలులోకి తేవాల్సి ఉంది.