న్యూఢిల్లీ, జూన్ 1 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతుండటం, క్రూడాయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడంతో మదుపర్లు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఇతర వాటికి మళ్లించడంతో వీటి ధరలు పడిపోతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో సోమవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,500 లేదా 1.53 శాతం తగ్గి రూ.1,60,400 లక్షలకు పడిపోయింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఇది రూ.1,62, 900గా ఉన్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రూ.820 తగ్గి రూ.1,60,900గా నమోదైంది.
వెండి పరుగుకు బ్రేక్
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు అంతేవేగంతో దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలు లేదా 2 శాతం తగ్గి రూ.2,69,700గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.2,74,700గా ఉన్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు భయాందోళనకు గురయ్యాయని, ఫలితంగా అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరుగడం కూడా లోహాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం తగ్గి 4,504.97 డాలర్లకు పడిపోగా, వెండి మాత్రం ఒక్క శాతం ఎగబాకి 75.93 డాలర్లు పలికింది.