Mehul Chowksi | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్పీ) స్కాం కేసులో పరారీలో ఉన్న నిందితుడు మెహుల్ చోక్సీ సరికొత్త వాదం తీసుకొచ్చారు. తనను మరోమారు భారత్ అధికారులు కిడ్నాప్ చేసే అవకాశం ఉందని చోక్సీ అన్నారని ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేపట్టిన ప్రొసీడింగ్స్కు వ్యతిరేకంగా ఈ నెలారంభంలో బాంబే హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తాను ప్రయాణాలు చేయలేనని పేర్కొన్నారు.
మెహుల్ చోక్సీ గత మే 23న అంటిగ్వా నుంచి అదృశ్యమయ్యాడు. అక్రమ మార్గంలో క్యూబాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న చోక్సీని డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తనను కొందరు కిడ్నాప్ చేశారని వాదించారు. ఆయన పారిపోయే అవకాశం ఉన్నందున ఇంతకుముందు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను డొమినికా కోర్టు తిరస్కరించింది. తర్వాత హెమటోమా వ్యాధితో బాధపడుతున్నానని, డొమినికాలో దానికి సంబంధించిన వైద్య నిపుణులు లేరని పేర్కొంటూ.. అంటిగ్వాలో చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని కోరాడు. రూ.2.75 లక్షల పూచీకత్తుతో ఆయనకు డొమినికా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భారత్ అధికారులు మరోమారు తనను గయానాకు తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా భారత్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించొచ్చు అని చోక్సీ ఆరోపించాడు. వైద్యుల సలహా మేరకు తాను బయట అడుగు పెట్టలేనని చెప్పుకొచ్చాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల మేరకు కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ స్కాం బయటపడే లోపే తన మేనల్లుడు నీరవ్మోదీతోపాటు దేశాన్ని వీడాడు.