Union Budget 2022 | వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రతి రూపాయిలో 58 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపేణ ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ లభించనున్నది. వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి 35 పైసలు రుణాలు, ఇతర అప్పుల రూపేణ ఆదాయం లభిస్తుంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 5పైసలు, నాన్-డెట్ క్యాపిటల్ వసూళ్ల ద్వారా రెండు పైసల ఆదాయం వస్తుంది.
మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. దీని ప్రకారం జీఎస్టీ ద్వారా 16 పైసలు, కార్పొరేట్ టాక్స్ ద్వారా 15 పైసల ఆదాయం రాబట్టనున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీ రూపేణా ఏడు పైసలు, కస్టమ్స్ డ్యూటీ ద్వారా ఐదు పైసల రెవెన్యూ వస్తుందని అంచనా వేశారు. ఇక ప్రతియేటా ఆదాయం పన్ను రూపంలో 15 పైసలు లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. రుణాలు, ఇతర అప్పుల రూపంలో 35 పైసల ఆదాయం సమకూర్చుకుంటామని వివరించారు.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వివిధ అప్పులపై వడ్డీ రూపంలో ప్రతి రూపాయిపై 20 పైసలు చెల్లిస్తారు. వివిధ పన్నులు, డ్యూటీలు, సుంకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు 17 పైసలు బదిలీ అవుతాయి. రక్షణ రంగానికి 8 పైసలు, కేంద్రప్రభుత్వ పథకాలకు 15 పైసలు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 9 పైసలు కేటాయిస్తారు.
ఫైనాన్స్ కమిషన్, ఇతర నగదు బదిలీలకు 10 పైసలు కేటాయిస్తారు. సబ్సిడీల రూపంలో 8 పైసలు, పెన్సన్ల కోసం 4 పైసలు ఖర్చు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇతర వ్యయాలకు ప్రతి రూపాయిలో 9 పైసలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.