ఒక నిర్ణయం వెనుక లక్షల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమనే ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుంది. ఒక ప్రణాళిక వెనుక గర్వంగా ప్రజలు తలెత్తుకునేలా చేసే నేర్పు ఒక్క కేసీఆర్కే చెల్లుతుంది. ఇది అక్షరాలా నిజం.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచిన అనుభవం ఉన్నవాడిని. ఒకప్పుడు తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యలు, వలసలు వెళ్లడం చూసేవాళ్లం. కానీ నేడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించాక ఆ పరిస్థితి మారింది. నాటి కలలను సాకారం చేయడానికి, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి, కోటి ఎకరాల మాగాణిగా చేయడానికి సంకల్పశుద్ధితో సాగుతున్న కారణజన్ముడు కేసీఆర్. తన ఆలోచనల ఆవిష్కరణ మూలంగా వెలసిన మానస పుత్రికయే కాళేశ్వరం ప్రాజెక్టు. గోదావరి జలాలు ఇంత ఎత్తుకు ప్రవహించి మెదక్ జిల్లాకు వస్తాయా అనే సందేహం అందరికీ ఉండేది. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ నేడు గోదావరి జలాలను కాళేశ్వరం నుంచి, మేడిగడ్డ నుంచి మెదక్ తెస్తున్నారు. ఒక రైతుబిడ్డగా మెదక్ నివాసిగా ఈ ఆనందం చెప్పలేనిది.
ఏ నీళ్ల కోసం అయితే కొట్లాడామో ఆ నీళ్లను అందరికి అందించిన అపర భగీరథుడు కేసీఆర్. ఆయనకు తెలంగాణలో కాలువలు, చెరువులు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు. ఇక్కడి రైతుల స్థితిగతులు దగ్గరుండి చూసి చలించిపోయిన నేత. నిజాం కాలం నుంచి మెతుకుసీమ రైతుల వ్యథను తెలుసుకున్న రైతు బిడ్డ. ఉద్యమం కంటే ముందు కూడా కేసీఆర్ మా గ్రామం కూచన్పల్లి నుంచి మెదక్ వెళ్తూ మార్గమధ్యంలో చెట్లు, పొదతో ఒక కాలువ ఉంటే అదేమిటని నన్ను ప్రశ్నించారు. సర్ ఇది ఘనపురం ఆయకట్టు నుంచి వచ్చే మహబూబ్నగర్ కాలువ సర్ అని చెప్పాను. నీటిపారుదలపై అమితమైన పట్టుతో ప్రతి విషయం పట్ల అవగాహన పెంచుకున్న వ్యక్తిత్వం ఆయనది. ఆ కాలం నుంచి నేటివరకు తెలంగాణలోని అణువణువు కేసీఆర్కు తెలుసు. ఎక్కడ ఏ కాలువ రావాలి. ఏ కాలువ ద్వారా ఎన్ని ఎకరాలు పండుతుంది అనేది తెలిసిన నాయకుడు. ఎక్కడ చెక్డ్యామ్ కట్టాలో బాగా తెలుసు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మంజీరపై మొట్టమొదటి చెక్డ్యామ్ కూచన్పల్లి దగ్గర నిర్మించారు. దానిద్వారా అనేక గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. నేడు మంజీరపై సుమారు 17 చెక్డ్యాములు నిర్మించి మెదక్ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చారు.
ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఎండకాలం వచ్చింది అంటేనే తాగునీటికి కష్టం ఉండేది. కానీ నేడు మండుటెండలో కూడా సాగునీరు అందించిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కింది. ఉద్యమాన్ని ఎంత సమర్థంగా నడిపి తెలంగాణ తెచ్చారో అంతకుమించి సమర్థంగా తెలంగాణ ప్రజల కోసం సరికొత్త పథకాలు తెచ్చిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన కార్యదక్షుడు కేసీఆర్. దేశం గర్వించే వ్యవసాయ పద్ధతులు, నీటి నిర్వహణ తీరులో ప్రత్యేకతల ఘనత తెలంగాణలోని వ్యవసాయానికి దక్కుతుంది.
గోదావరి జలాలు మేడిగడ్డ నుంచి 250 కిలోమీటర్లు ఎదురెక్కి 618 అడుగుల ఎత్తులోని కొండపోచమ్మ సాగర్కు చేరుకుంటాయి. రెండు జాతీయ రహదారులను తన్మయపరుస్తూ, సంగారెడ్డి కెనాల్పై 6.25 కిలోమీటర్ వద్ద నిర్మించిన ఓటీ ద్వారా బంధం చెరువు, పెద్దచెరువు, అంబర్పేట్ఖాన్ చెరువులు నిండుతాయి. ఆ తర్వాత తునికి ఖల్సా తపాస్ఖాన్ చెరువు వద్ద పుట్టిన హల్దీ వాగులోకి కాళేశ్వర గంగ అడుగుపెడుతుంది.
హల్దీవాగుపై ఉన్న 29 చెక్ డ్యాములు నింపుతూ, ఈ జలాలు వర్గల్ చదువుల సరస్వతమ్మను సందర్శించి, నాచారం లక్ష్మీనరసింహస్వామిని స్పృశించి.. మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి గుండా ప్రవహిస్తూ మెదక్ పసుపులేరు ఎల్లమ్మ తల్లిని పరవళ్లతో పరవశింపజేస్తూ, 70 కిలోమీటర్లు ప్రవహించి, మంజీర తీరం వెంబడి ఉన్న ఎల్లాపూర్ గ్రామస్థుల పంట పొలాల తీరంలో ఏడుపాయల వనదుర్గ సాక్షిగా గోదావరి నది తన ఉపనది మంజీరతో అనుసంధానమవుతుంది.
ఘనపురం ప్రాజెక్టుకు వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం చేసిన సందర్భంలో రాబోయే కాలంలో మన ప్రాంతానికి మరింత మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని మా ప్రాంత రైతులు వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే గోదావరి జలాలు మంజీరను తాకుతూ 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్ వరకు వెళ్లడం ఆనందదాయకం. మెదక్తోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు చెందిన రెండున్నర లక్షల ఆయకట్టుకు మేలు చేకూరనుంది.
మా ప్రాంత వాసులకు చరిత్రలో నిలిచిపోయే రోజు. పచ్చని పంటపొలాలతో కళకళలాడే మా మెతుకుసీమ ప్రాంతానికి వరదాయిని మంజీర. మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతశ్రేణిలో పుట్టిన మంజీర గోదావరి నదికి ఉపనది. ఈ ప్రాంతంలో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఒక రైతుకు కావలసింది సాగుకు నీళ్లు. ఆ నీళ్లు పుష్కలంగా ఉంటే సమృద్ధిగా పంటలు పండుతాయి.
కేసీఆర్ రైతుల్లో ఆ ధీమాను కలిగించారు. దేశానికి రైతే రాజు అని చాటడమే కాదు. అది నిరూపితమయ్యేందుకు కావలసిన చర్యలు చేపట్టే నేత కేసీఆర్. పుష్కర స్నానం కోసం పరితపించే భక్త జనానికి ఈ సంగమ స్థలం పుష్కర క్షేత్రంగా మారనున్నది. తెలంగాణ వచ్చాక పంట పెట్టుబడి కోసం కేసీఆర్ రైతుబంధుతో సాయమందించి రైతుల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. వ్యవసాయం దండగ అనే స్థాయి నుంచి పండగ అనేలా మార్చారు. అందరి చూపు వ్యవసాయం వైపు అనేలా చేశారు. కోట్ల మంది రైతుల హృదయాల్లో నిలిచిన రైతు బాంధవుడు. ఇలాంటి కేసీఆర్ వెంట నడవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మహత్తర నేలగా, పుణ్య పునీతమైన ప్రదేశంగా మెతుకుసీమను నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటాము.
వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు
సముద్రంలో కలవాల్సిన నీళ్లను సాగుకు ఉపయోగించాలన్న ఆలోచన చేసి, నదీజలాలను ఎగువ ప్రాంతాలకు ఎదురెక్కేలా చేసి, తరాలు చూడని మహాద్భుతాన్ని చూసే భాగ్యం కల్పించారు కేసీఆర్. కాళేశ్వర జలాలతో తెలంగాణ ప్రాంతాన్ని పచ్చని పంటల మణిహారంగా మారుస్తానన్నారు. ఆయన స్వప్నాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. గోదావరి నది తన ఉపనది మంజీరకు చేరే అద్భుత ముహూర్తమిది. ఒక జీవనది ఉపనదిని సంగమించే గడియలను చూసే అదృష్టాన్ని మెతుకుసీమ ప్రాంతం పొందడం నిజంగా గర్వించదగ్గ పరిణామం. రైతుబిడ్డగా గర్విస్తున్నా.
శేరి సుభాష్రెడ్డి