న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: రిటైల్ ఇన్వెస్టర్లకు క్యాపిటల్ మార్కెట్లో మదుపు పట్ల ఆసక్తి పెరగడంతో దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య తొలిసారిగా 10 కోట్లను మించింది. ఆగస్టు నెలలో 22 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభంకావడంతో మొత్తం ఖాతాల సంఖ్య 10.05 కోట్లకు చేరినట్టు డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటజరీ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడవుతున్నది. కొవిడ్కు ముందు 2020 మార్చి నెలనాటికి 4.09 కోట్లు ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య గత రెండేండ్లలో శరవేగంగా పెరిగాయి. మార్కెట్ జోరుగా పెరగడం, వర్క్ ఫ్రం హోం, మొబైల్ డాటా వినియోగం పెరగడంవంటి అంశాలన్నీ డీమ్యాట్ ఖాతాల వృద్ధికి కారణాలని విశ్లేషకులు వివరించారు. గృహ పొదుపు సెక్యూరిటీస్ మార్కెట్లోకి పెట్టుబడిగా తరలివస్తున్నదని, మదుపుదార్లకు డీమ్యాట్ ఖాతాలు ఆమోదయోగ్యం అయ్యాయని సీడీఎస్ఎల్ సీఈవో నెహల్ ఓరా చెప్పారు. రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడంతో 2020 ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టుకల్లా ఎన్ఎస్డీఎల్ కస్టడీ విలువ రూ.174 లక్షల కోట్ల నుంచి రూ.320 లక్షల కోట్లకు పెరిగినట్టు ఎన్ఎస్డీఎల్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వగాల్ తెలిపారు.