Credit Card | కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ప్రత్యేకించి వినియోగదారుల్లో క్రెడిట్ కార్డు వాడకం రోజురోజుకి పెరుగుతున్నది. గత జనవరి నెలలో క్రెడిట్ కార్డు లావాదేవీలు 29.6 శాతం పుంజుకుని ఆల్టైం రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం 2022 జనవరిలో క్రెడిట్ కార్డుల వాడకం దాదాపు పది శాతం మాత్రమే. 2022 జనవరిలో రూ.1,41,254 కోట్ల విలువైన లావాదేవీలు నమోదైతే, 2023 జనవరిలో రూ.1,86,783 కోట్లకు దూసుకెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది నెలల్లో క్రెడిట్ కార్డుల వాడం 20 శాతానికి పైగా పెరిగిందని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. అత్యధికంగా గత జూన్లో 30.7 శాతం లావాదేవీలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి.
పలు క్యాటగిరీల లావాదేవీలు డిజిటలైజ్డ్ కావడంతో క్రెడిట్ కార్డు వాడకం దారుల ఖర్చులు పెరిగాయని ఎస్బీఐ కార్డ్ ఎండీ కం సీఈవో రామమోహన్ రావు అమరా తెలిపారు. చెల్లింపులు తేలికవ్వడంతో హెల్త్, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, యుటిలిటీ బిల్లులు, తదితర లావాదేవీల ఖర్చులు పెరిగిపోయాయని చెప్పారు. గత కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డుల లావాదేవీలు నికరంగా పెరుగుతున్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్లో రూ.1.26 లక్షల కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాది జనవరిలో రూ.1.28 లక్షల కోట్లకు చేరాయని గుర్తు చేశారు. `ఏడాది ప్రాతిపదికన క్రెడిట్ కార్డుల వాడకంలో 45 శాతం ప్రగతి నమోదవుతున్నది. గత 11 నెలలుగా నికరంగా క్రెడిట్ కార్డు వినియోగం రూ.లక్ష కోట్లపైనే నమోదవుతున్నది` అని అన్నారు.
గత జనవరి నెలాఖరు నాటికి వివిధ బ్యాంకులు దాదాపు 8.25 కోట్ల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్.. టాప్-5 స్థానాల్లో నిలిచాయి. ఇటీవలి కాలంలో మార్టగేజ్ లోన్లు, బిజినెస్లోన్ల కంటే పర్సనల్ లోన్లు పెరిగిపోయాయని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీ స్వామినాథన్ తెలిపారు. `ఫ్రెష్గా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న కుర్రాళ్లు.. ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. తమ పేరెంట్స్తో పోలిస్తే ఆర్థిక లావాదేవీల పట్ల మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారు. క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.