Electric Vehicle | మీరు చౌక విద్యుత్ కారు కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే.. మీకో గుడ్ న్యూస్ వస్తోంది. బుధవారం అత్యంత చౌక విద్యుత్ కారు మార్కెట్లోకి రానున్నది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ పీఎంవీ ఎలక్ట్రిక్.. `ఈసాస్-ఈ EaS-E` విద్యుత్ కారును ఆవిష్కరించనున్నది. ఈ ఈవీ-కారు మైక్రో క్యాటగిరీ కారు. దీని ధర రూ.4 లక్షల్లోపే ఉండొచ్చునని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలు నిజమైతే దేశంలోనే అత్యంత చౌక కారు.. `ఈసాస్-ఈ EaS-E`కానున్నది. సింగిల్ చార్జ్తో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందీ `ఈసాస్-ఈ EaS-E`. ఇప్పటికే పీఎంవీ ఎలక్ట్రిక్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తిగల వారు పీఎంవీ ఎలక్ట్రిక్ వెబ్సైట్లోకి వెళ్లి రూ.2000 చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.
`ఈసాస్-ఈ EaS-E` కారు పూర్తిగా 10కేడబ్ల్యూ హెచ్ సామర్థ్యంతో కూడిన లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో తయారవుతున్నది. 20 హెచ్పీ విద్యుత్ ఉత్పత్తి చేయడం దీని సామర్థ్యం. ఈ బ్యాటరీ పూర్తి చార్జింగ్ కావడానికి నాలుగు గంటల టైం పడుతుంది.
రీజనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ పార్కింగ్ అసిస్ట్, ఓటీఏ అప్డేట్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి పలు స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారును మీ స్మార్ట్ఫోన్తో కనెక్ట్ చేయడంతో దాని ఎయిర్ కండీషన్ (ఈసీ)ని, హారన్ను, విండోలు, లైట్స్ను రిమోట్ సాయంతో కంట్రోల్ చేయొచ్చు. నాలుగు డోర్లతో ఇద్దరు మాత్రమే కూర్చునే వెసులుబాటు ఉంటుంది. ముందు డ్రైవర్ సీట్లో ఒకరు, వెనుక సీట్లో ఒకరు మాత్రమే కూర్చోవచ్చు.
ఇటీవలే టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్బ్యాక్ టియాగో మోడల్ కారు ఈవీ వేరియంట్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.8.49 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు ఇదే దేశంలో అతి చౌక ధర గల కారు. సింగిల్ చార్జింగ్తో 315 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.