న్యూఢిల్లీ, జనవరి 22: ఫార్మాస్యూటికల్స్ దిగ్గజాల్లో ఒకటైన సిప్లా లిమిటెడ్ గత త్రైమాసిక లాభంలో 32 శాతం వృద్ధి నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.801 కోట్లుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.1,068.41 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.66 శాతం ఎగబాకి రూ.6,603.81 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గతేడాది ఇది రూ. 5,810.09 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు రూ.5,119.81 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో ఉమాంగ్ వోహ్రా మాట్లాడుతూ..గత త్రైమాసికంలో టాప్లైన్ వృద్ధి 14 శాతంగా నమోదైందన్నారు. భారత్లో కంపెనీ వ్యాపారం 12 శాతం వృద్ధిని సాధించగా, బ్రాండెడ్ ప్రిక్సిప్షన్, ట్రేడ్ జనరిక్స్, కన్జ్యూమర్ హెల్త్ ఆశాజనక పనితీరు కనబరిచినట్లు చెప్పారు. గత త్రైమాసికంలో ఫార్మాస్యూటికల్స్ నుంచి రూ. 6,365 కోట్ల ఆదాయం లభించింది.