న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: తనకు ధరల్ని పెంచడమే తప్ప దించడం చేతకాదు..ద్రవ్యోల్బణంపై యుద్ధం చేస్తున్న రిజర్వ్బ్యాంక్ చేతులు కట్టేస్తూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణ నియంత్రణ బాధ్యతను రిజర్వ్బ్యాంక్కు స్వయానా అప్పగించింది కేంద్ర ఆర్థిక శాఖేనన్న విషయాన్ని విస్మరించిన ఆర్థిక మంత్రి ఆర్బీఐకి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్నూ గాలికొదిలేశారు. ద్రవ్య విధానం ద్వారా ఆర్బీఐ ధరల్ని నియంత్రించలేదని, మెజారిటీ ఆర్థిక కార్యకలాపాలు ఆర్బీఐ పరిధిలో ఉండవని ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లు సీతారామన్ ఒక తాజా సదస్సులో చెప్పుకొచ్చారు. వాస్తవానికి ద్రవ్యోల్బణం 2-4 శాతం శ్రేణిలో (ప్లస్ లేదా మైనస్ 2) నియంత్రించాల్సిన అధికారాన్ని రిజర్వ్బ్యాంక్కు అప్పగిస్తూ 2016లో కేంద్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కమోడిటీ ధరలు జోరందుకోవడంతో పాటు జీఎస్టీ పేరుతో కేంద్రం ప్రతీ నిత్యావసరంపై పన్నులు పెంచేయడంతో వినిమయ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యం 6 శాతాన్ని (4+2) మించి ఏడు నెలలుగా కొనసాగుతున్నది.
తక్కువ ధరతో క్రూడ్ తెస్తున్నాం..
అదే ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్
ప్రపంచ మార్కెట్ ధరకంటే తక్కువ ధరతో క్రూడ్ను దిగుమతి చేసుకుంటున్నామని, ఇది ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్లో భాగమేనని సీతారామన్ చెప్పుకున్నారు. మాస్కోపై ఆంక్షలున్నప్పటికీ దిగుమతి చేసుకోగలగడం మోదీ దౌత్య ఫలితమేనని కూడా అన్నారు. వాస్తవానికి దేశంలోకి రష్యా చమురు అంతర్జాతీయ ధర కంటే 30 డాలర్ల తక్కువకే లభిస్తున్నది. అంటే ఆగస్టు సగటు ధర 97 డాలర్లతో పోలిస్తే 67 డాలర్లకే రష్యా క్రూడ్ లభిస్తున్నట్టు. కానీ మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్పై ఒక్క పైసా పన్ను తగ్గించలేదు. మరి ఇది ద్రవ్యోల్బణ నిర్వహణలో భాగమేలా అవుతుందో ఆర్థిక మంత్రికే తెలియాలి. తాము చేస్తున్న ద్రవ్యోల్బణ నిర్వహణ అనేక దేశాలకు ఒక కేస్ స్టడీగా మారుతుందని గొప్పలు చెప్పుకున్నారు.
ధరా ఘాతం..కేంద్రానిదే పాపం
అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాల్ని పెంచుకుంటూపోయిన కేంద్ర ప్రభుత్వం దేశంలో ధరల మంట రేగడానికి కారణమయ్యింది. 2014లో లీటర్ పెట్రోల్పై రూ.8.48 ఉన్న ఎక్సైజ్ సుంకం ఇప్పుడు రెట్టింపునకు పైగా పెంచి రూ.19.90కి చేరింది. డీజిల్పై రూ.3.56గా ఉన్న ఎక్సైజ్ సుంకం ఏకంగా రూ.15.80కి చేరింది. ఇంధన వ్యయం ప్రభావంతో పాటు జీఎస్టీనీ బాదడంతో దేశంలో ప్రతీ ఉత్పత్తి ధర పెరిగిపోయింది. ఈ ఇంధనాలపై పన్నులు తగ్గించకపోగా, గతంలో ప్రతీ రోజూ ధరలు పెంచుకుంటూ పోయిన పెట్రో మార్కెటింగ్ కంపెనీలకు తగ్గించాలన్న ఆదేశాల్ని సైతం కేంద్రం ఇవ్వడం లేదు.
ఆర్బీఐ ప్రతిష్టకు దెబ్బ
ప్రపంచ ప్రధాన దేశాల్లో ఆయా కేంద్ర బ్యాంక్లు ద్రవ్య సరఫరా, పాలసీ రేట్ల పెంపు, కరెన్సీ నిర్వహణ తదితర అంశాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తుండగా, మరికొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఇంధనాలపై పన్నుల్ని తగ్గిస్తూ సామాన్యుడిపై ధరల ఒత్తిడిని తగ్గిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సీతారామన్ హఠాత్తుగా ఆర్బీఐ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐకి తానేమీ భవిష్యత్ మార్గనిర్దేశం చేయడం లేదంటూనే పలు పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్లే కట్టడి చేస్తాయని, ఇండియాలో అలా కాదన్నారు. ఏ దేశపు ఆర్థిక మంత్రీ ఇలా కేంద్ర బ్యాంక్ను అగౌరవ పర్చేలా మాట్లాడిన సందర్భం లేదు.