న్యూఢిల్లీ, జూలై 7: ఒక విద్యుత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కు సంబంధించి ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలపై రెండు కంపెనీలకు చెందిన ఆరుగురు అధికారుల్ని గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీఎస్ ఝా, టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వీపీ దేశ్ రాజ్ పథక్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ సింగ్లతో పాటు మరో ముగ్గుర్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి గుర్గావ్లోని ఝాకు చెందిన ఆవరణ నుంచి రూ.93 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు చెప్పారు.
టాటా ప్రాజెక్ట్స్ అధికారుల నుంచి లంచాలు తీసుకుంటున్నట్టు అందిన సమాచారం మేరకు ఝాపై కొద్దికాలంగా నిఘా ఉంచినట్టు వారు వెల్లడించారు. ఈశాన్య రాష్ర్టాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చేందుకు ప్రపంచ బ్యాంక్ నిధులతో అమలవుతున్న నార్త్ ఈస్ట్రన్ రీజియన్ పవర్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ టాటా ప్రాజెక్ట్స్ పొందిందని, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఈ స్కీమ్పై టాటా కంపెనీ పనిచేస్తున్నదని సీబీఐ అధికారులు వివరించారు. ఝా బిల్లుల్ని అధికంచేసి చూపించడం, బిల్లుల్ని త్వరితంగా క్లియర్చేయడంతో సహా వివిధ పనుల్లో సహకరించి, ముడుపులు తీసుకున్నారన్నారు. ఈ కేసు విషయంలో సంబంధిత యంత్రాంగాలకు పూర్తిగా సహకరిస్తామని టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు.