న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాలు అదిరాయి. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,666.22 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,010.87 కోట్ల లాభంతో పోలిస్తే 64.90 శాతం అధికమని శుక్రవారం పేర్కొంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, కోర్ ఇంట్రెస్ట్ ఇన్కం పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన రూ.21,040.63 కోట్ల నుంచి రూ.22,323.11 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి స్థూల నిరర్థక ఆస్తుల విలువను 6 శాతానికి తగ్గించాలనుకుంటున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. ఇటీవల కాలంలో కార్పొరేట్ రుణాలకు డిమాండ్ నెలకొన్నదని, ముఖ్యంగా రెన్యువబుల్ ఎనర్జీ, హెల్త్, స్టీల్, మౌలిక రంగాల నుంచి అధికంగా ఉన్నదన్నారు.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.93 శాతం నుంచి 7.51 శాతానికి తగ్గాయి.
ప్రతిషేరుకు రూ.6.50 డివిడెండ్ను ప్రకటించింది. దీనికి వాటాదారులు అనుమతించాల్సి ఉంటుందని పేర్కొంది.