ముంబై, జూలై 20: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం కోల్పోయి 77,708.52 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 783.16 పాయింట్లు పడిపోవడం గమనార్హం. కాగా, భారీ సంస్థల షేర్లను మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మేశారు.
ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల షేర్ విలువలు అత్యధికంగా 5.48 శాతం, 5.12 శాతం చొప్పున దిగజారాయి. ఇటీవలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటమే కారణమని మార్కెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 95.80 పాయింట్లు లేదా 0.39 శాతం క్షీణించి 24,238.50 వద్ద నిలిచింది.