Water Bottles | న్యూఢిల్లీ, జూలై 11: నాసిరకం ఉత్పత్తుల దిగుమతుల్ని నిరోధించేందుకు, దేశీ తయారీని పెంచేదిశగా నిప్పునిచ్చే లైటర్లు, వాటర్ బాటిళ్ల తయారీకి అవసరమైన నాణ్యతా ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం జారీచేసింది. ఈ రెండు ఐటెమ్స్ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) మార్క్ లేకుండా ఉత్పత్తి చేయడం, విక్రయించడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేయడం నిషిద్దమంటూ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీఐఎస్ చట్టాన్ని ఉల్లంఘిస్తే తొలి అపరాధంగా రెండేండ్ల వరకూ జైలు శిక్ష లేదా రూ.2 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. తదుపరి ఉల్లంఘనలకు కనీసం రూ. 5 లక్షల జరిమానా, ఉత్పత్తయిన వస్తువుల విలువకు 10 రెట్లు వరకూ ఫైన్ వేస్తారు. రూ.20 లోపు ధరకలిగిన సిగరెట్ లైటర్ల దిగుమతుల్ని గత నెలలో ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.