Investment Schemes | ప్రభుత్వోద్యోగులైతే 60 ఏండ్లు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి 58 ఏండ్లకు రిటైర్మెంట్ ఇస్తారు. రిటైర్మెంట్ తర్వాత స్వల్పంగా వచ్చే పెన్షన్ తప్ప ఆదాయ మార్గాలేమీ ఉండవు. రిటైర్మెంట్ తర్వాతైనా వారి రోజువారీ జీవనానికి కొంత మనీ అవసరం. అదీ కూడా ఎటువంటి రిస్క్ల్లేకుండా సేఫ్ రిటర్న్స్ వచ్చే ఆదాయ మార్గాలను ఎంచుకుంటారు సీనియర్ సిటిజన్లు. వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో గ్యారంటీ ఆదాయం లభించే అవకాశాలు ఎక్కువ. చాలా మంది అటువంటి పథకాల వైపే మొగ్గు చూపుతుంటారు. ఆ స్కీమ్లేమిటో ఓ లుక్కేద్దామా..!
60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లు మదుపు చేయడానికి వెసులుబాటు గల పథకాల్లో ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీం ఒకటి. దీన్ని భారతీయ జీవిత బీమా సంస్థ నిర్వహిస్తోంది. ఒకేసారి రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా మదుపు చేయొచ్చు. భార్యాభర్తలైతే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెలవారీగా, త్రైమాసికం వారీగా, ఆరు నెలలకోసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడి టెన్యూర్ 10 ఏండ్లు ఉంటుంది. దీనిపై 7.40 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.1000 పెన్షన్ పొందాలంటే రూ.1,62,162 పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా రూ.15 లక్షలు మదుపు చేస్తే నెలకు రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. ఇందులో పెట్టుబడిపై ఆదాయం పన్ను రాయితీ లేదు. కానీ, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు చేరడానికి అర్హులు.
ధరల కట్టడికి ఆర్బీఐ రెపోరేట్ పెంచేయడంతో బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెరిగాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా సవరించాయి. సీనియర్ సిటిజన్లకు 50 బేసిక్ పాయింట్లు అదనంగా వడ్డీ లభిస్తున్నందున.. దాదాపు ప్రతి బ్యాంకులోనూ వృద్ధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆరు శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఏడు శాతం వరకూ వడ్డీ ఇస్తున్నారు. మదుపరి పెట్టుబడిపై వచ్చే ఆదాయాన్ని బట్టి ఆదాయం పన్నులో మినహాయింపు పొందొచ్చు. పన్ను ఆదా చేసేందుకు మదుపు చేసే పెట్టుబడులపై ఐదేండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. కొన్ని బ్యాంకులు టీడీఎస్ వసూలు చేస్తున్నందున సీనియర్ సిటిజన్లు.. ఫామ్-15 హెచ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోస్టాఫీసు నిర్వహించే మంత్లీ ఇన్కం స్కీమ్లో కనీసం రూ.1000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దేశంలో అమల్లో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి. సింగిల్ ఖాతాలో గరిష్ఠంగా రూ.4.5 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.9 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ఏడాది ప్రాతిపదికన 6.6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తారు. ప్రతి నెలా వచ్చే వడ్డీని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు మళ్లించుకునే వెసులుబాటు కూడా ఉంది. నెలవారీ ఆదాయం స్కీమ్పై ఐదేండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మదుపు చేసిన మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు.. మళ్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఈ పథకానికి ఆదాయం పన్ను రాయితీ లభించదు.
పోస్టాఫీసు నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఇందులో త్రైమాసికం వారీగా అంటే మూడు నెలలకోసారి వడ్డీ పొందొచ్చు. 60 ఏండ్లు దాటిన వారు మాత్రమే ఈ పథకంలో మదుపునకు అర్హులు. ఈ పథకం టెన్యూర్ ఐదేండ్లు. ఆ తర్వాత మూడేండ్లు పొడిగించొచ్చు. కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ ప్రకరాం పన్ను మినహాయింపు ఉన్న పథకం ఇది.
భారతీయ స్టేట్ బ్యాంకుతోపాటు కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల్లో ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లలో నిధులు మదుపు చేయడమే ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు. ఆర్బీఐ అనుమతి గల ప్రైవేట్ బ్యాంకుల్లోనూ వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లకు ఏడేండ్ల గడువు ఉంటుంది.ఈ బాండ్లపై 7.15 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల (ఎన్ఎస్ఈ)పై కంటే అధికంగా 0.35 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఏటా జనవరి, జూలై ఒకటో తేదీ (ఏడాదికి రెండుసార్లు)లలో మాత్రమే వడ్డీ ఆదాయం చెల్లిస్తారు.