న్యూఢిల్లీ, జూలై 24: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వడ్డీరేటు స్వల్పంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను 8.15 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) ఇది 8.10 శాతంగా ఉన్నది. దీంతో 0.05 శాతం మాత్రమే పెరిగినైట్టెంది. కాగా, ఈ ఏడాది మార్చి 28న ఈపీఎఫ్వో ట్రస్టీలు 2022-23కుగాను వడ్డీరేటును 8.15 శాతంగా ప్రతిపాదించారు. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపగా, అందుకు అనుగుణంగా అనుమతి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక సభ్యుల ఖాతాల్లో పెరిగిన వడ్డీరేటు ప్రకారం నిధులను జమ చేయాలని ఫీల్డ్ ఆఫీసర్లను ఈపీఎఫ్వో ఆదేశించింది. కాగా, ఈపీఎఫ్వోలో 6 కోట్లకుపైగా ఖాతాదారులున్న విషయం తెలిసిందే.
ఎన్నికల దృష్ట్యానే..
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈపీఎఫ్వో వడ్డీరేటును ఈ మాత్రమైనా మోదీ సర్కారు పెంచిందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. నిజానికి కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఈపీఎఫ్వో వడ్డీరేటును 0.60 శాతం తగ్గించింది. 2014-15లో 8.75 శాతంగా ఉండగా, తాజా పెంపుతో ఇప్పుడది 8.15 శాతంగా ఉన్నది. ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021-22లోనైతే ఏకంగా 44 ఏండ్ల కనిష్ఠాన్ని తాకింది. గరిష్ఠంగా 0.40 శాతం తగ్గించి వడ్డీరేటును 8.10 శాతానికి కేంద్రం పరిమితం చేసింది. 1977-78 తర్వాత ఈపీఎఫ్వో సొమ్ముకు దక్కిన వడ్డీరేట్లలో ఇదే తక్కువ కావడం గమనార్హం. నాడు 8 శాతంగా ఉన్నది.