న్యూయార్క్ : యాపిల్ వంటి టెక్ దిగ్గజంలో ఏడాదికి కోట్ల రూపాయల వేతనం అందుకునే ఉద్యోగులు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ హైప్రొఫైల్ జాబ్ను కాపాడుకునేందుకు మొగ్గుచూపుతారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆఫీస్ నుంచి పనిచేయాలని యాపిల్ తన ఉద్యోగులను కోరడంతో ఏకంగా కోట్లాది రూపాయల వేతనంతో కూడిన కొలువునే వదులుకున్నాడు గుడ్ఫెలో అనే టెకీ. యాపిల్లో ఆయన ఎంత వేతనం అందుకుంటున్నాడనేది వెల్లడికాకున్నా గుడ్ఫెలో వార్షిక వేతనం రూ 6 కోట్ల నుంచి రూ 8 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
యాపిల్కు బై చెప్పడంతో గుడ్ఫెలో ఎంతకాదన్నా రూ 8 కోట్ల వేతనాన్ని చేజేతులా వదులుకున్నాడు. యాపిల్లో మెషీన్ లెర్నింగ్ డైరెక్టరగా పనిచేసే గుడ్ఫెలో కంపెనీ హైబ్రిడ్ వర్క్ పాలసీని వ్యతిరేకిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన టీంకు పనిలో వెసులుబాటు ఉంటేనే మెరుగైన ఉత్పాదకత సాధ్యమవుతుందని తాను నమ్ముతానని యాపిల్ను వీడుతూ విడుదల చేసిన నోట్లో గుడ్ఫెలో చెప్పుకొచ్చాడు.
కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను క్రమంగా కార్యాలయాల నుంచి పనిచేయించేందుకు యాపిల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. మే 23 నుంచి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని ఉద్యోగులను యాపిల్ కోరింది. ఈ పాలసీని వ్యతిరేకిస్తూ పలువురు ఉద్యోగులు రాజీనామా చేస్తుండగా గుడ్ఫెలో వైదొలగిన అనంతరం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.