న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: లిస్టెడ్ సిమెంట్ కంపెనీలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీలను విక్రయించి, భారత్ నుంచి యూరప్ సంస్థ హోల్సిమ్ వైదొలగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 17 సంవత్సరాల క్రితం అంబుజా సిమెంట్ను భారత ప్రమోటర్ల నుంచి హోల్సిమ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఏసీసీలో మెజారిటీ వాటా అంబుజాకు ఉన్నందున, పరోక్షంగా ఏసీసీ యాజమాన్య పగ్గాలు కూడా హోల్సిమ్వే. ఈ రెండు కంపెనీల్లో తన వాటాను విక్రయించేందుకు జేఎస్డబ్ల్యూ, అదాని గ్రూప్, ఇతర సంస్థలతో హోల్సిమ్ ప్రాధమిక చర్చలు జరుపుతున్నదని సమాచారం. ఆయా సంస్థల ఆసక్తిని తెలుసుకునేందుకు చర్చలు సాగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే సిమెంటు రంగంలోకి ప్రవేశించిన జెఎస్డబ్ల్యూ, అదానిలు…ఇతర కంపెనీల్ని టేకోవర్ చేయడం ద్వారా ఈ రంగంలో సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవాలన్న భారీ ప్రణాళికలతో ఉన్నాయి.
హోల్సిమ్ వాటా విలువ రూ. 46,200 కోట్లు
అంబుజా సిమెంట్ మార్కెట్ విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం హోల్సిమ్ వాటాను కొనాలంటే రూ. 46,200 కోట్లు పెట్టుబడి చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ తెలిపింది. దీంతో పాటు ఏసీసీ, అంబుజా సిమెంట్… రెండు కంపెనీల పబ్లిక్ షేర్హోల్డర్ల నుంచి 26 శాతం వాటాకు సెబీ నిబంధనల ప్రకారం కొనుగోలుదారు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకు మరో రూ.29,800 కోట్లు వెచ్చించాల్సివస్తుందని, దీంతో వీటి టేకోవర్ వ్యయం రూ.78,000 కోట్లకు చేరుతుంది. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి చేసే సామర్థ్యం అతికొద్ది భారత కార్పొరేట్లకే ఉందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది.