ఎయిరిండియా.. గతనెల 27న పుట్టింటికి.. అంటే టాటా సన్స్కు గూటికి చేరింది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా మనుగడ సాగించిన ఎయిరిండియాకు ఆ పేరు ఎలా వచ్చింది.. ఎవరు పెట్టారు తెలుసుకుందామా.. 75 ఏండ్లకు ముందే ఎయిరిండియా అని టాటా సన్స్ తన ఎయిర్లైన్స్ సంస్థకు నామకరణం చేసిందట. ఇందుకోసం పేర్లు సజెస్ట్ చేయాలని టాటా ఉద్యోగులందరి అభిప్రాయాలు కోరింది. టాటా ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు టాటా సన్స్ తమ అనుబంధ ఎయిర్లైన్స్కు ఎయిరిండియా అని పేరు పెట్టినట్లు ఆదివారం ట్వీట్ చేసింది.
1946 వరకు టాటా సన్స్ అనుబంధ టాటా ఎయిర్లైన్స్గా సాగింది. తర్వాత దాన్ని టాటా ఎయిర్లైన్స్ సంస్థగా విడగొట్టింది టాటా సన్స్. అప్పుడే ఈ సంస్థకు ఒకపేరు పెట్టాలని టాటాలు నిర్ణయించుకున్నారు. సంస్థ ఉద్యోగుల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో నాలుగు పేర్లు వచ్చాయి. ఇండియన్ ఎయిర్లైన్స్, పాన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ట్రాన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిరిండియా అని ప్రతిపాదనలు వచ్చాయని టాటా సన్స్ ఆదివారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించింది. #ఎయిరిండియాఆన్బోర్డు #వింగ్స్ఆఫ్చేంజ్ అని ట్వీట్ చేసిన టాటా సన్స్.. ఎయిరిండియా పేరు పెట్టడానికి కారణాలు తెలిపింది. ఈ పేరు పెట్టడానికి పలు సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు ట్వీట్ చేసింది.
శాంపిల్ ఒపీనియన్ సర్వే మాదిరిగా నిర్వహించిన ఈ అధ్యయనంలో టాటా సన్స్ ఉద్యోగులు ఫస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్లు ఇచ్చారు. 64 మంది ఎయిరిండియాకు ఓటేశారు. 51 మంది ఇండియన్ ఎయిర్లైన్స్, 28 మంది ట్రాన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్, 19 మంది పాన్ ఇండియన్ ఎయిర్లైన్స్ అని ప్రతిపాదించారు. తక్కువ మంది అనుకూలంగా ఉన్న పేర్లను తొలగిస్తే, చివరకు ఎయిరిండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్లైన్స్ 58 మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో టాటా సన్స్ అనుబంధ ఎయిర్లైన్స్ను ఎయిరిండియాగా మార్చేశామని టాటా తెలిపింది.
ఎయిరిండియాకు పేరు పెట్టిందెవరు? అనే పేరుతో టాటా సన్స్ తొలి ట్వీట్ చేసింది. కానీ తుది నిర్ణయం ఎవరు తీసుకున్నారో తెలుసుకోవడానికి దీన్ని చదవండి అంటూ. 1946 నాటి టాటా సన్స్ మంథ్లీ మ్యాగజైన్ పేజీలను ట్విట్ చేసింది. ఈ ట్వీట్లన్నీ టాటా సన్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా సాగాయి. గత నెల 27న ఎయిరిండియా యాజమాన్య హక్కులను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా సన్స్ టేకోవర్ చేసింది. ప్రభుత్వానికి రూ 2,700 కోట్లు చెల్లించి, మిగతా రూ.15,300 కోట్లు బ్యాంకుల కన్సార్టియం రుణాల చెల్లింపునకు అంగీకరించింది. మిగతా రుణాలను కేంద్రం ఎయిరిండియా నుంచి ఏఐఏహెచ్ఎల్కు ట్రాన్స్ఫర్ చేసింది.