న్యూఢిల్లీ, జనవరి 12: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్), టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్, టాటా టెలీసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ (టీటీఎంఎల్)ల ఏజీఆర్, స్పెక్ట్రం బాకీలపై వడ్డీ బకాయిలు ప్రభుత్వ ఈక్విటీలుగా మారినా.. ఆ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కాబోవని కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను ఈక్విటీలోకి మార్చినా.. ఆయా టెలికం సంస్థల ప్రస్తుత, భవిష్యత్తు రుణ బకాయిల బాధ్యత వాటిదేనని టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ఇక్కడ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కంపెనీల్లో ప్రభుత్వం ఒక మదుపరిగా మాత్రమే ఉంటుందన్నారు. కాగా, కొత్త ప్రతిపాదనతో వీఐఎల్లో 35.8 శాతం, టీటీఎంఎల్లో దాదాపు 9.5 శాతం వాటాలు ప్రభుత్వం చేతికి రానున్నాయి. ఇదిలావుంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సంక్షోభంలో పడిందని మంత్రి ధ్వజమెత్తారు. అయితే తమ ప్రభుత్వ విధానాలతో ఇప్పుడు కోలుకుంటున్నదన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు దాదాపు రూ.70,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్టు వివరించారు. సంస్థ అభివృద్ధికి మరింత ఊతమిస్తామన్నారు. స్వల్పకాలిక రుణాల చెల్లింపు కోసం, 4జీ నెట్వర్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి రూ.40,000 కోట్లను బీఎస్ఎన్ఎల్ కోరుతున్నట్టు తెలిపారు. అయితే బీఎస్ఎన్ఎల్ కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్.. స్వదేశీ పరిజ్ఞానంతో 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేసిందన్నారు.