రుణభారం తగ్గుతుందన్న అంచనాలు
ముంబై, జూన్ 14: రుణ ఊబిలో కూరుకుపోయిన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) కంపెనీల షేర్లన్నీ సోమవారం 5 శాతం అప్పర్ సర్క్యూట్ లిమిట్ను తాకాయి. ఆ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 1,325 కోట్ల విలువైన షేర్లు, వారెంట్లను ప్రిఫరెన్సియల్ ప్రాతిపదికన జారీచేసే ప్రతిపాదనను మరో గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించడంతో ఈ ర్యాలీ జరిగింది.రిలయన్స్ పవర్ రూ.13.37 వద్దకు, రిలయన్స్ ఇన్ఫ్రా రూ.86.75 స్థాయికి, రిలయన్స్ కేపిటల్ రూ.21.55 వద్దకు, రిలయన్స్ హోంఫైనాన్స్ రూ.4.71 వద్దకు పెరిగాయి. రిలయన్స్ పవర్ 59.5 కోట్ల షేర్లను 73 కోట్ల వారెంట్లను రిలయన్స్ ఇన్ఫ్రాకు జారీచేస్తుంది.తద్వారా రిలయన్స్ పవర్ రుణభారం తగ్గుతుంది. అలాగే ఈ కంపెనీలో రిలయన్స్ ఇన్ఫ్రా వాటా పెంచుకుంటుంది. అడాగ్ గ్రూప్ కంపెనీల షేర్లు గత ఏడాదికాలంలో పెరుగుతూవస్తున్నాయి. ఏడాదిలో రిలయన్స్ పవర్ 420 శాతం రాబడుల్ని ఇవ్వగా, గత నెలలోనే ఇది రెట్టింపయ్యింది. ఏడాదిలో ఇన్వెస్టర్ల సంపదను మూడు రెట్లు పెంచిన రిలయన్స్ ఇన్ఫ్రా గత నెలరోజుల్లో 63 శాతం పెరిగింది. రిలయన్స్ కేపిటల్ నెలరోజుల్లో 89 శాతం పెరగ్గా, రిలయన్స్ హోంఫైనాన్స్ 70 శాతం ర్యాలీచేసింది. రుణభారాన్ని తగ్గించుకునే చర్యల్ని గ్రూప్ చురుగ్గా చేపట్టవచ్చన్న అంచనాలతో షేర్లు పెరుగుతున్నట్లు ఏంజిల్ బ్రోకింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అమర్జీత్ మౌర్య చెప్పారు.