కరోనా నీడలు తొలగిపోయాయి. ఆఫీసుల తలుపులు తెరుచుకున్నాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఠంచనుగా పడుతున్నాయి. నియామకాలూ బాగానే ఉన్నాయి. దీంతో ఉద్యోగినుల ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉంటున్నది. అందచందాలు, అలంకరణల మీద దృష్టి సారిస్తున్నారు. గత ఆరు నెలల్లో దేశంలోని పది ప్రధాన నగరాలలో లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, ఐ లైనర్లు మొదలైనవాటి కొనుగోలు కోసం దాదాపు రూ.5 వేల కోట్ల రూపాయలు వెచ్చించారు మహిళా జనం.
ఇందులో యాభై శాతం ఆన్లైన్ విక్రయాలే. కాస్మటిక్ బూమ్కు, మహిళా సాధికారతకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆమెలో కొనుగోలు శక్తి పెరిగిందంటే, సంపాదన కూడా పెరిగినట్టే. ఏరికోరి అలంకరణ వస్తువులను షాపింగ్ చేస్తున్నదంటే ఆర్థిక స్వేచ్ఛను దర్జాగా అనుభవిస్తున్నదనే అర్థం. ఇదంతా మంచి పరిణామమే. కాకపోతే, సౌందర్య సాధనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.