కోనసీమ జిల్లా : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు జనసేన అధినేతతో భేటీ అయ్యారు. త్వరలో ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ ప్రస్తుతం జగన్ పార్టీలో కీలక నేతగా ఎదగడంతో.. ఈ నాయకుడు జనసేనలో చేరడం ఖాయమని తెలుస్తున్నది.
కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు బొంతు రాజేశ్వరరావు హైదరాబాద్లో పవన్ కల్యాణ్తో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఆయన జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజోలు నుంచి జనసేన టికెట్పై గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీ మద్దతుదారుగా నిలిచి ప్రస్తుతం కీలకనేతగా ఎదిగారు. దాంతో ఇక్కడ వైసీపీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ దక్కడం ఇబ్బందికరంగా మారింది. దాంతో ఆయన జనసేన వైపు తన దృష్టిని మరల్చినట్లుగా చెప్తున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు బొంతు రాజేశ్వరరావు 2014, 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో కేవలం 700 ఓట్లతోనే ఓడిపోయారు. ఆయన కొద్దిరోజులు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. రాజేశ్వరరావు సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఆయనను పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ సలహాదారుగా నియమించింది. ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు, పదవులు లేకుండా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధినాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆయన జనసేనలో చేరేందుకే పవన్ కల్యాణ్ను కలిశారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది.