అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలన రాష్ట్రానికి హానికరమని, వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అలంకార పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
దివ్యాంగుల సంక్షేమానికి మ్యానిఫెస్టోలో ప్రత్యేక స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబరు నుంచి పార్టీలో నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామని వివరించారు. పార్టీలో క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని , పార్టీలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ సమసమాజాన్ని, మానవత్వాన్ని కోరుకుంటుందని తెలిపారు. జనవాణి, కౌలురైతుల భరోసా ద్వారా కొత్త సమస్యలు తమకు తెలిశాయని, రాయలసీమలో యువత ఉపాధి కల్పించాలని కోరుతున్నారని వెల్లడించారు.
రాజకీయాల్లో ఒక కులాన్ని పట్టుకుని ముందుకెళ్లలేమని , అన్ని కులాల సహకారంతోనే ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం జీరో బడ్జెట్ ఎన్నికలు సాధ్యం కాదని అన్నారు. డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతాయా అని ప్రశ్నించారు.అధికారం చూడని కులాలకు జనసేన పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. రాయలసీమలో పరిశ్రమ పెట్టాలంటే స్థానిక నేతలకు కప్పం కట్టాలని, కప్పం కట్టకుంటే ఏమవుతుందో కియా పరిశ్రమ అనుభవం ఒక ఆదర్శమని పేర్కొన్నారు.