Pawan Kalyan | కవి అయినా, కళాకారుడైనా, నాయకుడైనా ప్రజల పక్షాన నిలబడకపోతే వారి జన్మ వృధా అని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం విశాఖపట్నలోని కూర్మనపాలెం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఎంతో భావోద్వేగాలను రగిల్చిందన్నారు. కులాలకు, వర్గాలకతీతంగా ఒక్కే ఒక్క నినాదం రాష్ట్రాన్ని కుదిపేసిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం భూములిచ్చిన వారికి ఇంకా పరిహారం అందనేలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వార్త వినగానే తనకూ బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వెంటనే ఢిల్లీకి వెళ్లి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వినతిపత్రం సమర్పించామని చెప్పారు. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉందని అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ప్రజా బలం ఉన్నందునే అపాయింట్మెంట్ లభించిందని చెప్పారు.