అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడాల గుర్తింపు ప్రక్రియకు తాత్కాలిక జాబితాలో స్థానం దక్కింది. ఈ మేరకు ప్యారిస్ లోని యునెస్కో కార్యాలయం తాజాగా విడుదల జాబితాను విడుదల చేసింది. భారతదేశం నుంచి మూడు కట్టడాల చరిత్ర వాటి ఔన్నత్యంపై జాబితాను యునెస్కోకు పంపింది. దీంతో లేపాక్షి ఆలయం తాత్కాలిక జాబితాకు ఎంపికయ్యిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
16వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపలి వైపు ఉన్న చిత్రాలు, ఆలయానికి సమీపంలో ఉన్న అతిపెద్ద ఏక శిలా నంది పర్యటకంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ రెండింటిని కీలకంగా తీసుకున్నా యునెస్కో లేపాక్షికి జాబితాలో చోటు కల్పించింది. యునెస్కో బృందం త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తుది జాబితాను విడుదల చేయనుంది. తాత్కాలిక జాబితాలో చోటు దక్కటంపై అమరావతి అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులుతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.