Tirumala | తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. తాజాగా అలిపిరి నడకదారిలోని ఆఖరిమెట్ల వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. వాటిని చూసిన వారంతా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. చిరుతల జాడను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు.
చిరుతల సంచారం నేపథ్యంలో భద్రతా సిబ్బంది భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. మరో వైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి.. పలు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇటీవల చిరుతల సంచారం పెరుగుతుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.