పెళ్లి పీటల మీదే నవ వధువు కుప్ప కూలిన ఘటనలో కొత్త కోణం వచ్చి చేరింది. సృజన అనే వధువు నీరసంగా ఉండటం వల్లే సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్ప కూలిపోయిందని మొదట్లో వార్తలొచ్చాయి. తాజాగా… ఆమెది ఆత్మహత్య అని అంటున్నారు. ఇష్టం లేని పెళ్లి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేకే… సృజన గన్నేరు పప్పు తిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే….
విశాఖ మధురవాడకు చెందిన సృజన వివాహం శివాజీ అనే యువకుడితో నిశ్చయమైంది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ముహూర్తం. ముహూర్తం సమయం వరకూ సృజన అత్యంత ఉత్సాహంగానే కనిపించింది. అయితే.. రెండు రోజుల కిందటే సృజన అనారోగ్యంగా ఉండటంతో కుటుంబీకులు వైద్యులకు చూపించారు.
వైద్యం పూర్తైన తర్వాతే కుటుంబీకులు పెళ్లి పీటల మీదికి తెచ్చారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సరిగ్గా ముహూర్తం సమయానికి వధువు, వరుడు పెళ్లి పీటల పైకి వచ్చారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో సృజన ఒక్క సారిగా వేదికపైనే కుప్పకూలింది. దీంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.