అమరావతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు(Brahamotsavams) శుక్రవారం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం అనంతరం నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రం ఉన్న ధ్వజ పటాన్ని ఆరోహణం చేశారు.
టీటీడీ(Ttd)ఈవో ఎవి ధర్మారెడ్డి దంపతులు, జేఈవో సదా భార్గవి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, విజివో బాలిరెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసా చార్యులు, కంకణ భట్టార్ మణికంఠ స్వామి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ఎవి ధర్మారెడ్డి శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్పకళాశాలలో ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, తిరుమల -తిరుపతి స్పిరుచువల్ సొసైటీ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన శాలను ప్రారంభించారు.
ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని , మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం (Darsan) కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థం కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత(Security), ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ సందర్భంగా చెన్నై కు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డి ఎల్ వసంత కుమార్ తదితరులు అమ్మవారికి ఆరు గొడుగులను కానుకగా అందించారు.