Guntur Kaaram | ఈ మధ్య ఏ సినిమాను తీసుకున్నా అందులో పొలిటికల్ పంచులు కూడా బాగానే దంచేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోలైతే దగ్గరుండి మరీ రాజకీయ వ్యంగాస్త్రాలు రాయించుకుంటున్నారు. బోయపాటి శ్రీను లాంటి దర్శకులు కూడా కావాలనే పొలిటికల్ సెటైర్లు పెడుతున్నారు సినిమాల్లో. స్కందలో విషయం లేకపోయినా వివాదం మాత్రం బాగానే అయింది. దానికి కారణం అందులో ఉన్న డైలాగులు.. ముఖ్యంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా అందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన టైమ్లోనే స్కంద సినిమా కూడా వచ్చింది. అందులోనే బాబుకు లింక్ అయ్యేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. దాంతో స్కంద కేరాఫ్ కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత బ్రో సినిమాపై రేగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఏకంగా మంత్రి అంబటి రాంబాబు సైతం ప్రెస్ మీట్ మరీ బ్రో సినిమా కలెక్షన్ల గురించి మీడియా ముందు చెప్పాడు. బ్రో సినిమా ఫ్లాపైనా.. అందులో పొలిటికల్ డైలాగ్స్ మాత్రం బాగానే పేలాయి. అయితే పవన్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనేం చేసినా ఎవరూ ఏం పట్టించుకోరు. కానీ రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉండే మహేశ్ బాబు సినిమాలో పొలిటికల్ పంచులు ఉంటే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు. తాజాగా గుంటూరు కారంలో ఇదే ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో మాస్ మసాలాతో పాటు రాజకీయ ఘాటు కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.
ముందు సినిమాలు ఫ్లాపైనా.. క్లాసిక్స్గా నిలిచిపోయాయి. పైగా మహేశ్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి కచ్చితంగా గుంటూరు కారం మొతెక్కిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. పండక్కి ఐదు సినిమాలు వస్తున్నా.. అందులో అగ్ర తాంబూలం దగ్గరుండి మరీ గుంటూరు కారంకే ఇస్తున్నారు బయ్యర్లు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని పొలిటికల్ పంచులు ఉండబోతున్నాయని తెలుస్తుంది. మామూలుగానే త్రివిక్రమ్ పెన్నుకు పవర్ ఎక్కువ.. అలాంటిది ఆయన చేతి నుంచి రాజకీయ వ్యంగ్యాస్త్రాలు వచ్చాయంటే మాత్రం కచ్చితంగా రచ్చ లేవడం ఖాయం. కథ ప్రకారం ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ అంశాలు ఉన్నాయని.. వాటిని గట్టిగానే మేళవించారని తెలుస్తోంది.
గుంటూరు మేయర్ రాజకీయాల చుట్టూ ఈ కథ నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఆమెను మేయర్ చేసే బాధ్యత మహేశ్ బాబుపై పడుతుందని.. ఆ జర్నీలోనే ఎదురయ్యే అవాంతరాలు, ఆటంకాల నేపథ్యంలో సినిమా కథ ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. అందుకే ఈ సినమాకు ముందు ‘అమరావతికి అటూ ఇటూ’ అనే టైటిల్ పరిశీలించారు. అయితే మరీ పొలిటికల్ సినిమా అనుకుంటారేమో అని మాస్ కోసం గుంటూరు కారం టైటిల్కు ఫిక్స్ అయ్యారు. ఇందులో మిర్చి యార్డ్ వెంకట రమణగా నటిస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో రమ్యకృష్ణ, మహేశ్ల మధ్య సన్నివేశాలు ఎమోషనల్గా వర్కవుట్ అవుతాయని నమ్ముతున్నారు మేకర్స్. క్లాస్, మాస్ థియేటర్స్లో పండక్కి ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా మీల్స్ సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రమ్. మరి చూడాలిక.. మహేశ్ రాజకీయం ఎలా ఉండబోతుందో..?
ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈనెల 4న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరనున్నారు. ఆమెతోపాటు మరో 40 మంది కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షర్మిల భర్త అనిల్కుమార్తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు చర్చించినట్టు సమాచారం. ఫైనల్గా షర్మిలతో కూడా ఈ విషయం మరోసారి చర్చించాక ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.