హైదరాబాద్ : వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే శాఖ.. ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడిచేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు గురువారం రైల్వేశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిలో ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్- మన్మాడ్ మధ్య 126 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. దాదర్, మడ్గావ్ మధ్య మరో 6 వేసవి ప్రత్యేకరైళ్లు నడుస్తాయి.
తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. 07509 హైదరాబాద్-తిరుపతి రైలు శనివారం సాయంత్రం 4-35 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి మర్నాడు ఉదయం 5-30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
అదే విధంగా 07510 తిరుపతి-హైదరాబాద్ రైలు మంగళవారం రాత్రి 11-50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12-30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మే 3, 10,17,24,31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. 07511 తిరుపతి-ఔరంగాబాద్ మధ్య మరో ప్రత్యేకరైలు నడువనున్నది. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 07-05 గంటలకు తిరుపతిలో బయలు దేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.