ఏలూరు: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలోని (Porus chemical factory) నాలుగో యూనిట్లో బుధవారం రాత్రి 10 గంటల సమంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. మరొకరు మార్గమధ్యలో మృతిచెందారని చెప్పారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పరిశ్రమలో ఔషధాల తయారీకి అవసరమైన పొడిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ఉన్నారని, వారిలో ఇద్దరు కెమిస్టులు, 16 మంది కార్మికులు అని వెల్లడించారు. మరణించినవారిలో ఇద్దరు స్థానికులు కాగా, మిగిలినవారు బీహార్కు చెందినవారని తెలిపారు. గాయపడినవారిలో కూడా ఎక్కువగా బీహారీలే ఉన్నారన్నారు. యాజమాన్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారని హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభగ్య లక్ష్మి చెప్పారు. వారిలో ఒకరు మార్గమధ్యలో చనిపోయారని, మిగిలిన 12 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. 70 శాతానికిపైగా కాలిపోయారని, ఒక్కరి పరిస్థితి మాత్రమే మెరుగ్గా ఉందని, మిగిలివారు సీరియస్ కండీషన్లో ఉన్నారని వెల్లడించారు.